Udaipur Murder Case: రాజస్తాన్ లోని ఉదయ్పూర్ లో దర్జీ పని చేసుకుంటున్న కన్హయ్యలాల్ హత్యోదంతంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. అయితే అతడికి నెటిజన్లు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించినందుకు గాను రాజస్తాన్ లోని ఉదయ్పూర్ లో టైలర్ పని చేసుకుంటున్న కన్హయ్యలాల్ ను ఇద్దరు దుండగులు హత్య చేసిన ఉదంతం దేశమంతా చర్చనీయాంశమైంది. సాధారణ జనమే గాక సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు ఈ ఘటన మీద తమదైన బాణీని వినిపిస్తున్నారు. ఇదే క్రమంలో ఘటనను ఖండిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్ మీద నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉదయ్పూర్ హత్యోదంతంపై ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘మీరు ఏ విశ్వాసాల (మతం)ను అనుసరించినా ఫర్వాలేదు. కానీ అమాయకుల జీవితాలను బాధపెట్టడం అంటే అది మొత్తం మానవాళిని బాధపెట్టినట్టే..’ అని ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ పై ఒక వర్గానికి చెందిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ లో పఠాన్ ట్వీట్ కు రిప్లై ఇస్తూ.. ‘ఆ విశ్వాసమేదో చెప్పరాదు ఇర్ఫాన్..’, ‘ఏ విశ్వాసాన్ని ఫాలో కావాలో అది చెప్పు ముందు..’, ‘మీరు వండిన ఈ వంటకాల (ట్వీట్స్) ను చదివినిప్పుడల్లా మేము విసిగిపోతున్నాం. దయచేసి నిజం చెప్పండి..’, ‘ఇంక జనాలను పిచ్చోళ్లను చేయొద్దు.. జనాలకు ఇప్పటికే అర్థమైంది..’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక ఇదే ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్లు కూడా స్పందించారు. టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ స్పందిస్తూ.. ‘ఉదయ్పూర్ లో జరిగిన ఘటన చాలా బాధాకరం. దయచేసి అందరూ సహనం పాటించండి. ఈ దారుణ ఘటనపై చట్టం కఠినమైన నిర్ణయం తీసుకోవాలి..’ అని ట్వీట్ చేశాడు.
మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా ట్వీట్ లో.. ‘ఉదయ్పూర్ లో జరిగింది చట్ట విరుద్ధం. అతడి మానవ హక్కుల గురించి అడిగేదెవరు..? అతడి కుటుంబం గురించి పట్టించుకునేదెవరు..? అతడి మతం సంగతి ఏమిటి..?’ అని పేర్కొన్నాడు.
