ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్ విక్టరీ.. ఆనందంతో జడ్డూను హగ్ చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే
IPL 2023: సోమవారం అర్థరాత్రి అహ్మదాబాద్ వేదికగా ముగిసిన ఐపీఎల్-16 ఫైనల్ లో ఆఖరి రెండు బంతుల్లో చెన్నై విజయానికి 10 పరుగులు అవసరం కాగా జడ్డూ మాయ చేశాడు.
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. ముంబై ఇండియన్స్ ఐదు టైటిల్స్ రికార్డును సమం చేసింది. గుజరాత్ టైటాన్స్తో సోమవారం అర్థరాత్రి ముగిసిన తర్వాత తేలిన ఫలితంలో చెన్నై సూపర్ కింగ్స్కు ఉత్కంఠ విజయాన్ని అందించాడు ఆ జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. మోహిత్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా ఆఖరి రెండు బంతుల్లో 6,4 కొట్టి చెన్నైకి సూపర్ డూపర్ విక్టరీని అందించాడు.
జడ్డూ ఆటను అహ్మదాబాద్ లో వేలాది మంది అభిమానుల సమక్షంలో వీక్షించిన అతడి భార్య, గుజరాత్ లోని జామ్నగర్ అసెంబ్లీ ఎమ్మెల్యే (బీజేపీ) రివాబా జడేజా.. అతడిని ఆనందంతో హగ్ చేసుకుంది. జడ్డూ ఆఖరి బంతికి ఫోర్ కొట్టగానే స్టాండ్స్ లో ఎగిరి గంతేసిన రివాబా.. ఆ తర్వాత జడేజా దగ్గరికి వచ్చి ఆత్మీయంగా అలింగనం చేసుకుంది.
ఈ క్రమంలో భావోద్వేగంతో ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రివాబాను హగ్ చేసుకున్న జడేజా.. ఆమెను ఓదార్చుతూ పక్కనే ఉన్న కూతురితో చెన్నై విజయ క్షణాలను పంచుకున్నాడు. నిన్నటి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 96 పరుగులతో రాణించాడు. వర్షం కారణంగా చెన్నై ఇన్నింగ్స్ను 15 ఓవర్లకే కుదించిన అంపైర్లు.. ఆ జట్టు లక్ష్యాన్ని 171 పరుగులుగా నిర్దేశించారు. అయితే డెవాన్ కాన్వే (47), శివమ్ దూబే (32 నాటౌట్), గైక్వాడ్ (26), అంబటి రాయుడు (19), అజింక్యా రహానే (27) లు చెన్నైని విజయానికి చేరువ చేశారు.
కానీ ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 13 పరుగులు కావాల్సి ఉండగా ఫస్ట్ నాలుగు బంతుల్లో మూడు పరుగులే వచ్చాయి. మోహిత్ శర్మ తన అనుభవన్నంతా ఉపయోగించి చెన్నైకి విజయాన్ని దూరం చేయడానికి ఫిక్స్ అయ్యాడు. కానీ ఐదో బంతిని జడ్డూ భారీ సిక్సర్ గా మలిచాడు. ఇక ఆఖరి బంతికి చెన్నై విజయానికి నాలుగు పరుగులు అవసరమనగా.. ఫైన్ లెగ్ దిశగా బౌండరీ బాదిన జడేజా అశేష చెన్నై అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు.