IPL 2023: ఐపీఎల్ లో నేడు రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ ఆడనున్న పంజాబ్ కింగ్స్ కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్ గాయం కారణంగా సీజన్ నుంచి తప్పుకున్నాడు.
గతడేది అండర్ - 19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యడు, ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆల్ రౌండర్ రాజ్ అంగద్ బవ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. పంజాబ్ కు ఇప్పటికే ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో దూరమవగా.. ఇంకా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో లియామ్ లివింగ్స్టోన్ కూడా ఇప్పటికీ జట్టుతో చేరలేదు. తాజాగా రాజ్ బవ కూడా దూరమవడం ఆ జట్టుకు ఎదురుదెబ్బే..
2022 సీజన్ వేలంలో పంజాబ్.. రాజ్ బవను రూ.2 కోట్లతో కొనుగోలు చేసింది. గత సీజన్ లో అతడు పీబీకేఎస్ తరఫున రెండు మ్యాచ్ లు కూడా ఆడాడు. కానీ ఈ సీజన్ కు ముందు బవ ఎడమ చేతి భుజానికి గాయమైంది. అయితే ఐపీఎల్- 16 వరకైనా అతడు టీమ్ లోకి తిరిగొస్తాడని టీమ్ మేనేజ్మెంట్ భావించినా బవ మాత్రం కోలుకోలేదు.
నేడు రాజస్తాన్ తో జరుగబోయే మ్యాచ్ కు ముందు బవ స్థానంలో గుర్నూర్ సింగ్ ను భర్తీ చేస్తున్నట్టు పంజాబ్ ప్రకటించింది. పంజాబ్ కు చెందిన ఈ ఆల్ రౌండర్.. ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. బ్యాటింగ్ లో 107 పరుగులు, బౌలింగ్ లో ఏడు వికెట్లు తీశాడు. ఐపీఎల్ లో గుర్నూర్ బేస్ ప్రైజ్ రూ. 20 లక్షలతో అతడిని దక్కించుకుంది.
కాగా ఈ సీజన్ లో పంజాబ్ ఆడిన తొలి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ ను తమ సొంత మైదానం మొహాలీలో ఓడించింది. ఈ మ్యాచ్ లో పంజాబ్.. మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. భానుక రాజపక్క హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం కేకేఆర్.. 16 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో కేకేఆర్.. ఏడు పరుగుల తేడా (డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో)తో ఓడింది.
కాగా నేడు గువహతి వేదికగా జరుగబోయే మ్యాచ్ లో పంజాబ్.. రాజస్తాన్ ను ఢీకొననుంది. రాజస్తాన్ కు సెకండ్ హోమ్ గా ఉన్న గువహతి స్టేడియంలో జరిగే మ్యాచ్ లో రాజస్తాన్ ను కట్టడి చేయడం పంజాబ్ కు అంత ఈజీ కాదు. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న రాజస్తాన్ కూడా టైటిల్ వేటలో మరో ముందడుగు వేయడానికి అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. మరోవైపు మొహాలీలో ఇచ్చిన విజయంతో పాటు కొత్తగా టీమ్ లో సఫారీ పేసర్ కగిసొ రబాడా కూడా చేరడంతో పంజాబ్ కూడా బలంగా తయారైంది. గత మ్యాచ్ లో రాణించిన భానుక, శిఖర్ ధావన్, సామ్ కరన్ లు నేటి మ్యాచ్ లో కూడా విజృంభిస్తే రాజస్తాన్ కు కష్టాలు తప్పవు.

