IPL 2023, KKR vs RR: ఐపీఎల్ -16లో  చాలా రోజుల తర్వాత ఒక మ్యాచ్ వన్ సైడెడ్ అయింది.   బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాలలో  రాజస్తాన్.. కోల్కతాపై ‘రాయల్స్’ ఆట ఆడింది. 

ఐపీఎల్-2023లో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లు చూసి ‘ఇదంతా స్క్రిప్ట్’ అనుకుంటున్నవారికి గురువారం జరిగిన మ్యాచ్ కాస్త డిఫరెంట్ ఫీలింగ్‌ను కలిగించిందని చెప్పక మానదు. మరి స్క్రిప్ట్ లో ఇది ఉందో లేదో గానీ స్క్రిప్ట్ లోని డ్రామాను మించిన విధ్వంసం ఈడెన్ గార్డెన్ లో జరిగింది. ఐపీఎల్-16లో ఫస్ట్ వీక్ తర్వాత మొదలైన ‘లాస్ట్ ఓవర్ థ్రిల్లర్’ల తర్వాత ఒక మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా జరుగడం ఇదే ప్రథమం. ఒకరకంగా ఇది కోల్కతాపై.. ‘దండయాత్ర రాజస్తాన్ దండయాత్ర’ అని చెప్పక తప్పదు. ఈ మ్యాచ్ లో పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

అత్యధిక వికెట్లు : 

ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన ఘనతను యుజ్వేంద్ర చహల్ దక్కించుకున్నాడు. నేటి మ్యాచ్ లో కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా వికెట్ తీయడం ద్వారా చహల్.. ఐపీఎల్ లో డ్వేన్ బ్రావో పేరిట ఉన్న హయ్యస్ట్ వికెట్ టేకర్ (183) రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్ కు ముందు 183 వికెట్ల తో ఉన్న చహల్.. నేటి మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీయడం ద్వారా తన వికెట్ల సంఖ్యను 187 కు పెంచుకున్నాడు. 

- అంతేగాక ఈ సీజన్ లో డెత్ ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో పతిరన (12) తర్వాత చహల్ (11) నిలిచాడు. 

- చహల్ సాధించిన ఈ ఘనతతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు (విరాట్ కోహ్లీ - 7,044), అత్యధిక వికెట్లు వీరుడు కూడా భారతీయులే కావడం విశేషం. 

Scroll to load tweet…

ఫాస్టెస్ట్ ఫిఫ్టీ :

- బ్యాటింగ్ విధ్వంసం అన్న పదానికి కొత్త అర్థాన్నిచ్చాడు రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. తాను ఎదుర్కున్న మొదటి బంతి నుంచి 47 వ బంతి వరకూ బాదుడే మంత్రంగా ఆడిన జైస్వాల్.. 13 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా కెఎల్ రాహుల్ , పాట్ కమిన్స్ (14 బంతుల్లో), యూసుఫ్ పఠాన్, పూరన్ (15), రైనా, ఇషాన్ (16 బంతుల్లో) రికార్డులను తుడిచేశాడు. 

- ఫస్ట్ ఓవర్ లో 26 పరుగులు చేసిన జైస్వాల్.. ఈ క్రమంలో ఈ లీగ్ లో ఇలా బాదిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 2011 సీజన్ లో ఆర్సీబీ - ముంబై మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్లో 27 పరుగులొచ్చాయి. కానీ అందులో ఏడు ఎక్స్ట్రాలు ఉన్నాయి. కేకేఆర్ తో మ్యాచ్ లో రాజస్తాన్ చేసిన 26 పరుగులూ యశస్వి చేసినవే.. 

- ఐపీఎల్ లో ఒక ఇన్నింగ్స్ లోని పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సురేశ్ రైనా (87), గిల్‌క్రిస్ట్ (74), ఇషాన్ (63) ల తర్వాత యశస్వి (62) నిలిచాడు.

- ఈ మ్యాచ్ లో కేకేఆర్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ 13.1 ఓవర్లలోనే ఛేదించింది. మరో 41 బంతులు మిగిలుండగానే 150 ప్లస్ టార్గెట్ ను ఛేదించిన రాజస్తాన్.. గతంలో ముంబై (37 బంతులు) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది.