IPL 2023: ఐపీఎల్ -16లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఏదీ కలిసిరావడం లేదు. ఇప్పటికే ఈ సీజన్ లో వరుసగా  ఐదు మ్యాచ్ లలో ఓడిన ఆ జట్టుకు మరో షాక్ తాకింది. 

ఐపీఎల్ -2023 సీజన్ లో ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలను క్రమంగా కోల్పోతున్న షాక్ లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ కు దొంగలు మరో షాకిచ్చారు. ఆటగాళ్ల కిట్ బ్యాగ్ లలో బ్యాట్స్, థైపాడ్స్, షూస్, గ్లవ్స్ చోరీకి గురయ్యాయి. టీమ్ లోని విదేశీ ఆటగాళ్లకు సంబంధించిన బ్యాట్ ల విలువ ఒక్కోటి లక్ష రూపాయల దాకా ఉండొచ్చని అంచనా. 

ఈనెల 15న బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ముగిసిన తర్వాత ఆదివారం ఉదయం ఢిల్లీ ఆటగాళ్లు బెంగళూరు నుంచి వచ్చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు చేరుకున్నాక తమ కిట్లలోని వస్తువులు కోల్పోయినట్టు ఆటగాళ్లు గుర్తించారు. 

చోరీకి గురైన వస్తువులలో 16 బ్యాట్లు, షూస్, థై ప్యాడ్స్, గ్లవ్స్ , ఇతర సామాగ్రి ఉన్నట్టు సమచారం. బ్యాట్లు కోల్పోయిన వారిలో ఢిల్లీ సారథి డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడు. వార్నర్ కు సంబంధించిన మూడు బ్యాట్లతో పాటు మిచెల్ మార్ష్, ఫిల్ సాల్ట్, యశ్ ధుల్ ల బ్యాట్లు ఉన్నాయి. మరికొందరి గ్లవ్స్, షూస్ కూడా దొంగిలించబడ్డట్టు ఆటగాళ్లు ఢిల్లీ యాజమన్యానికి ఫిర్యాదు చేశారు.

Scroll to load tweet…

ఇదే విషయమై ఢిల్లీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘టీమ్ లోని ప్రతీ ప్లేయర్ ఏదో ఒక వస్తువును పోగొట్టుకున్నాడు. ఈ వార్త తెలిసిన వెంటనే మేం షాక్ కు గురయ్యాం. ఇలా జరగడం ఇదే ప్రథమం. దీనిపై ఎయిర్‌పోర్ట్ లాజిస్టిక్ విభాగానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాం..’అని చెప్పాడు.

కాగా గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ ఉండటంతో బ్యాట్లు కోల్పోయిన వారందరూ సంబంధిత కంపెనీలకు ఫోన్ చేసి వారికి కావాల్సిన సామాగ్రిని తెప్పించుకుంటున్నారని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. గురువారం సాయంత్రం ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వార్నర్ సేన.. కేకేఆర్ తో తలపడనుంది. ఐపీఎల్ - 16 పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉన్న ఢిల్లీ.. ఈ మ్యాచ్ లో అయినా గెలిచి బోణీ కొట్టాలని భావిస్తున్నది. 


Scroll to load tweet…