IPL 2023, CSK vs PBKS: చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో   చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి భారీ స్కోరు చేసింది. కాన్వే  సెంచరీ మిస్ అయినా  జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. 

స్వంత గ్రౌండ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి రెచ్చిపోయింది. చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై ఓపెనర్ డెవాన్ కాన్వే (52 బంతుల్లో 92 నాటౌట్, 16 ఫోర్లు, 1 సిక్సర్) వీరవిహారంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కాన్వేకు తోడుగా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (31 బంతుల్లో 37, 4 ఫోర్లు, 1 సిక్సర్) కూడా రాణించాడు. ఫలితంగా చెన్నై బౌలర్లకు పోరాడగలిగే స్కోరును అందించారు. మరి రెండో ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా, తీక్షణ, మోయిన్ అలీల స్పిన్ మాయాజాలాన్ని తట్టుకుని పంజాబ్ ఈ లక్ష్యాన్ని ఛేదించగలదా..? అనేది ఆసక్తికరం. 

టాస్ గెలిచి మొదలు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓపెనర్లు శుభారంభమే అందించారు. రుతురాజ్ గైక్వాడ్ మరోసారి మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. కానీ కాన్వే మాత్రం రెచ్చిపోయి ఆడాడు. 

రబాడా వేసిన రెండో ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన కాన్వే.. తర్వాత అదే జోరు కొనసాగించాడు. గైక్వాడ్ కూడా అర్ష్‌దీప్ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు, రాహుల్ చాహర్ వేసిన ఐదో ఓవర్లో ఓ సిక్సర్ కొట్టాడు. సామ్ కరన్ వేసిన ఆరో ఓవర్లో కాన్వే రెండు, గైక్వాడ్ ఓ బౌండరీ బాదారు. రజ వేసిన 10 వ ఓవర్లో గైక్వాడ్ ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. దీంతో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 

గైక్వాడ్ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే (17 బంతుల్లో 28, 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. కానీ ఎక్కువసేపు నిలువలేదు. కాన్వేతో కలిసి దూబే రెండో వికెట్ కు 44 పరుగులు జోడించాడు.మరోవైపు 30 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న కాన్వే.. ఆ తర్వాత జోరు పెంచాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 14వ ఓవర్లో ఆరో బంతికి దూబే భారీ షాట్ ఆడి షారుక్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చాడు. 

Scroll to load tweet…

దూబే స్థానంలో వచ్చిన మోయిన్ అలీ (10) రెండు ఫోర్లు కొట్టినా అతడిని రాహుల్ చాహర్ ఔట్ చేశాడు. కానీ ఐదో స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా (12) తో కలిసి కాన్వే చెన్నై ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించాడు. ఇద్దరూ కలిసి 18 బంతుల్లో 27 పరుగులు జోడించారు. లివింగ్‌స్టోన్ వేసిన 15వ ఓవర్లో రెండు బౌండరీలు, రాహుల్ చాహర్ వేసిన 17వ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టి 80లలోకి చేరాడు. అయితే చివరి ఓవర్లో 90లలోకి వచ్చిన కాన్వే దానిని సెంచరీగా మలుచుకోలేకపోయాడు.లాస్ట్ ఓవర్ లో వచ్చిన ధోని (13 నాటౌట్) రెండు భారీ సిక్సర్లు బాది స్కోరును 200 చేర్చాడు.