IPL 2023: ఐపీఎల్ - 16  సందర్భంగా   దేశంలోని చాలా చోట్ల బెట్టింగ్  రాయుళ్ల చేతిలో కోట్లాది రూపాయల డబ్బులు మారుతున్నాయి.  తాజాగా మరో ఘటన భారత క్రికెట్ లో కలకలం రేపింది. 

టీమిండియా స్టార్ పేసర్, ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ను బెట్టింగ్ వలలో ఇరికించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొద్దిరోజుల క్రితమే ఈ హైదరాబాదీ పేసర్‌కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. ఆర్సీబీ టీమ్ లోపల జరిగే విషయాలు తనకు చెప్పాలని బలవంతం చేశాడు. కానీ సిరాజ్ ఈ విషయాన్ని బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో అవినీతి నిరోధక శాఖ (ఆంటీ కరప్షన్ యూనిట్) అధికారులు అప్రమత్తమయ్యారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పీటీఐ కథనం మేరకు.. హైదరాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ సిరాజ్ కు ఫోన్ చేసి ఆర్సీబీకి సంబంధించిన అంతర్గత విషయాలు చెప్పాలని బలవంతం చేశాడు. అయితే వెంటనే సిరాజ్ ఈ విషయాన్ని బీసీసీఐ ఏసీయూకు తెలిపాడు. దీంతో ఏసీయూ రంగంలోకి దిగింది. అతడిని పట్టుకుందని తెలుస్తోంది. సిరాజ్ ను సంప్రదించింది బుకీ కాదని.. అతడు ఐపీఎల్ బెట్టింగ్ లకు అలవాటుపడి డబ్బు పోగొట్టుకున్న ఆటో డ్రైవర్ అని ఏసీయూ విచారణలో తేలినట్టు సమచారం.

కాగా మరికొన్ని నేషనల్ వెబ్‌సైట్స్ లో మాత్రం సిరాజ్ ను ఆటో డ్రైవర్ సంప్రదించింది ఐపీఎల్ కోసం కాదని, ఈ సీజన్ ముందే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో అతడు సిరాజ్ కు ఫోన్ చేసినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఏదేమైనా భారత క్రికెట్ కు మాత్రం ఇది షాకిచ్చింది. 

Scroll to load tweet…

ఎందుకంటే ఐపీఎల్ లో గతంలో ఇలాంటి తరహా ఘటనల వల్లే అటు లీగ్ తో పాటు బీసీసీఐకీ చెడ్డపేరొచ్చింది. శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీమాల్ ఫిక్సింగ్ ఉచ్చులో పడ్డ తర్వాత బీసీసీఐ ఏసీయూను మరింత బలోపేతం చేసింది. ఫిక్సింగ్ కు సంబంధించి చీమ చిటుక్కుమన్నా ఏసీయూకు తెలిసిపోతుంది. గతంలో ఫిక్సింగ్ కారణంగానే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ కూడా ఐపీఎల్ లో రెండేండ్ల పాటు నిషేధానికి గురైన విషయం తెలిసిందే. 

Scroll to load tweet…

ఇదిలాఉండగా రెండ్రోజుల క్రితమే చెన్నై చేతిలో పోరాడి ఓడిన ఆర్సీబీ.. తమ తర్వాతి మ్యాచ్ లో పంజాబ్ ను ఢీకొననుంది. గురువారం మొహాలీ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.