ఇంజినీరింగ్ ఎగ్జామ్ పేపర్లో కోహ్లీ గురించి ప్రశ్న.. ఆన్సర్ మీకు తెలుసా..?
Virat kohli: రన్ మిషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ -16లో బిజీబిజీగా గడుపుతున్నాడు. తాజాగా అతడికి సంబంధించి ఓ ఆసక్తికర పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.
![IPL 2023: A question based on Virat Kohli in the 2nd year Computer Engineering MSV IPL 2023: A question based on Virat Kohli in the 2nd year Computer Engineering MSV](https://static-ai.asianetnews.com/images/01gxbstbgz9wdbqqn54wjrvw34/untitled-jpg_363x203xt.jpg)
ఆధునిక క్రికెట్ లో దిగ్గజంగా వెలుగొందుతున్న టీమిండియా మాజీ సారథి, రన్ మిషీన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఐపీఎల్-16 లో బిజీబిజీగా గడుపుతున్న కోహ్లీ మరోసారి ఆర్సీబీ మ్యాచ్ లేకున్నా నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాడు. దానికి కారణం ఓ ఎగ్జామ్ పేపర్ లో కోహ్లీ గురించి ప్రశ్న అడగడమే. విరాట్ వన్డే కెరీర్ కు సంబంధించి ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో క్వశ్చన్ వచ్చింది.
వివరాల్లోకెళ్తే.. చెన్నైలోని శివ నాడార్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరానికి సంబంధించి కంప్యూటర్ ఇంజినీరింగ్ ప్రశ్నాపత్రంలో కోహ్లీపై ప్రశ్న అడిగారు. అతడి వన్డే కెరీర్ లో 2008 నుంచి ఇప్పటివరకు ఆడిన ఇన్నింగ్స్.. సాధించిన పరుగులను ప్రస్తావించారు.
2008 నుంచి కోహ్లీ వన్డేలలో ఆడిన ఇన్నింగ్స్, పరుగులను ఇచ్చి వాటి ఆధారంగా 2023లో 23 ఇన్నింగ్స్ ఆడితే ఎన్ని పరుగులు చేస్తాడో అంచనా వేయాలని ప్రశ్న వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనికి నెటిజన్లు వివిధ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రశ్నకు ఆ విద్యార్థులు ఏం సమాధానం రాశారో తెలియదు గానీ నెటిజన్లు మాత్రం తమ గణిత శాస్త్ర ప్రావీణ్యాన్ని చూపిస్తున్నారు. దాదాపు అందరూ ఈ ఏడాది కోహ్లీ 23 ఇన్నింగ్స్ (వన్డేలలో) ఆడితే 1,000 -1150 మధ్య పరుగులు సాధిస్తాడని అంచనా వేస్తున్నారు.
కాగా మొత్తంగా విరాట్ ఇప్పటివరకు 274 వన్డేలలో 57.32 సగటుతో 12,898 పరుగులు చేశాడు. ఇందులో 46 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలున్నాయి. వన్డేలలో మరో మూడు సెంచరీు చేస్తే కోహ్లీ.. సచిన్ రికార్డును సమం చేస్తాడు. ఇక ఐపీఎల్ లో మొత్తం 231 మ్యాచ్ లు ఆడి 223 ఇన్నింగ్స్ లలో 6,957 పరుగులు చేశాడు కోహ్లీ. 2010 నుంచి ప్రతీ సీజన్ లో 300 ప్లస్ స్కోరు చేస్తున్న కోహ్లీ.. ఈ సీజన్ లో ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడి 333 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉండం విశేషం. ఆర్సీబీ తమ తర్వాతి మ్యాచ్ ను మే 1న లక్నోతో ఆడనున్నది.