ఐపీఎల్ 2022 సీజన్లో మొదటి హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ... రజత్ పటిదార్తో కలిసి భారీ భాగస్వామ్యం... గ్లెన్ మ్యాక్స్వెల్ మెరుపులు... అయినా భారీ స్కోరు చేయలేకపోయిన ఆర్సీబీ...
విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చేశాడు. సీజన్లో రెండు రనౌట్లు, రెండు గోల్డెన్ డకౌట్స్, ఓ సింగిల్ డిజిట్ స్కోరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తర్వాత ఐపీఎల్ 2022లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు విరాట్ కోహ్లీ.. అయితే క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడంతో భారీ స్కోరు చేయలేకపోయింది ఆర్సీబీ...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేయగలిగింది. రెండో ఓవర్లో కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ డకౌట్ కావడంతో 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
అయితే ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను తీసుకున్న విరాట్, యంగ్ ప్లేయర్ రజత్ పటిదార్తో కలిసి 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు... అల్జెరీ జోసఫ్ వేసిన 5వ ఓవర్లో రెండు వరుస ఫోర్లు బాదిన విరాట్ కోహ్లీ, ఫర్గూసన్ వేసిన 10వ ఓవర్లో ఓ సిక్సర్, ఫోర్ బాదాడు.. 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ...
ఐపీఎల్లో 15 ఇన్నింగ్స్ల తర్వాత విరాట్ కోహ్లీ చేసిన మొట్టమొదటి హాఫ్ సెంచరీ ఇదే. ఇంతకుముందు 2009-10 సీజన్ల మధ్య హాఫ్ సెంచరీ చేయడానికి 18 ఇన్నింగ్స్ల గ్యాప్ తీసుకున్నాడు విరాట్ కోహ్లీ...
ఐపీఎల్ కెరీర్లో విరాట్ కోహ్లీకి ఇది 43వ హాఫ్ సెంచరీ. ఈ ఇన్నింగ్స్లో కొట్టిన రెండు సిక్సర్లతో టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్గా రెండో స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ...
రోహిత్ శర్మ టీ20 కెరీర్లో 429 సిక్సర్లతో టాప్లో నిలవగా, భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ 326 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా 325 సిక్సర్లతో తర్వాతి స్థానంలో నిలిచాడు.
మరో ఎండ్లో వన్డౌన్లో వచ్చిన రజత్ పటిదార్ 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పటిదార్కి ఇదే మొట్టమొదటి హాఫ్ సెంచరీ... 32 బంతుల్లో 52 పరుగులు చేసిన పటిదార్, ప్రదీప్ సాంగ్వాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు...
53 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్తో 58 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. బీభత్సమైన ఫామ్లో ఉన్న దినేశ్ కార్తీక్ 3 బంతుల్లో 2 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్వెల్, లూకీ ఫర్గూసన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు...
ఆఖర్లో మహిపాల్ లోమ్రోర్ 8 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తోె 16 పరుగులు చేయడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది ఆర్సీబీ.
