ఐపీఎల్ 2022 ప్రొమోలో బస్సు డ్రైవర్‌గా మారిన ఎమ్మెస్ ధోనీ... ప్రోమోలో కనిపించని కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్...

ఐపీఎల్ 2022 మెగా సమరం మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2022 సీజన్‌కి సంబంధించిన కొత్త ప్రోమోను విడుదల చేసింది బీసీసీఐ... కొన్నేళ్లుగా ఐపీఎల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఈ ప్రోమోలో బస్సు డ్రైవర్ అవతారంలో కనిపించాడు...

ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు బస్సును వెనక్కి తిప్పి, ట్రాఫిక్‌కి అడ్డంగా పెట్టేస్తాడు మాహీ. ట్రాఫిక్ పోలీస్ వచ్చి, ఎందుకిలా పెట్టావని అడిగితే... తన స్టైల్‌లో సూపర్ ఓవర్ నడుస్తోందంటూ చెబుతాడు... దీంతో ట్రాఫిక్ పోలీస్, ‘ఒకే తలైవా..’ అంటూ వెళ్లిపోతాడు...

Scroll to load tweet…

ఆఖరిలో 10 జట్లలో కీలక ప్లేయర్లను చూపించారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఉండడం విశేషం... అలాగే ఆర్‌సీబీ, ఐపీఎల్ 2022 సీజన్‌ కెప్టెన్‌ని ఇంకా ప్రకటించలేదు. దీంతో ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రోమోలో కనిపించగా... పంజాబ్ కింగ్స్ సారథిగా మయాంక్ అగర్వాల్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ కనిపించారు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టుకి సారథిగా శ్రేయాస్ అయ్యర్ ఎంపికైనప్పటికీ అతనికి బదులుగా కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండ్రే రస్సెల్ ఫోటో కనిపించడం విశేషం... కేకేఆర్ ఇప్పటికే కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌‌ను ప్రకటించినా, అతని ఫోటో వేయకపోవడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అయ్యర్‌కి అన్యాయం జరిగిందంటూ అప్పుడే ఆరోపణలు మొదలైపోయాయి...

 కరోనా వల్ల రెండేళ్లుగా ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించిన బీసీసీఐ, ఈసారి మాత్రం ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించాలని భావిస్తోంది. 2022 ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచులకు 25 శాతం మంది ప్రేక్షకుల మధ్య నిర్వహించాలని, ఆ తర్వాత పరిస్థితులను బట్టి 50 శాతం నుంచి 75 శాతం వరకూ జనాలను అనుమతించాలని భావిస్తోంది బీసీసీఐ...

అలాగే ఐపీఎల్‌ ప్రసార హక్కుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలుగా స్ట్రాటెజిక్ టైమ్ అవుట్ సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుందట బీసీసీఐ. ఇంతకుముందు 150 సెకన్ల పాటు (రెండున్నర నిమిషాలు) స్ట్రాటెజిక్ టైమ్ అవుట్ రూపంలో ఆటకు బ్రేక్ లభించేది. ఇప్పుడు దాన్ని మూడు నిమిషాలకు (180 సెకన్లు) నిర్ణయం తీసుకుంది ఐపీఎల్ యాజమాన్యం...

10 ఫ్రాంఛైజీలు పాల్గొనబోయే ఐపీఎల్ 2022 సీజన్‌... మార్చి 26న మొదలుకానుంది. దాదాపు రెండున్నర నెలల పాటు సుదీర్ఘంగా సాగే 15వ సీజన్, మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది... ఐపీఎల్ 2022 లీగ్ మ్యాచులన్నీ మహారాష్ట్రలోని ముంబై, పూణే నగరాల్లో నిర్వహించబోతోంది బీసీసీఐ. ఐపీఎల్ మ్యాచుల సన్నాహకాల కోసం మార్చి 8 నాటి కల్లా ముంబై చేరుకుని, క్యాంపులు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఫ్రాంఛైజీలకు ఇప్పటికే సూచించింది భారత క్రికెట్ బోర్డు...