TATA IPL 2022: టీమిండియా భావి సారథుల జాబితాలో ముందు వరుసలో ఉన్న రిషభ్ పంత్, కెఎల్ రాహుల్ నేడు ఐపీఎల్ లో రెండో సారి తలపడుతున్నారు. ఇప్పటికే ఈ లీగ్ లో ఈ ఇద్దరూ ఒకసారి పోటీ పడగా అందులో లక్నోనే విజయం వరించింది. దానికి పగ తీర్చుకోవాలని రిషభ్ పంత్ సేన భావిస్తున్నది.
ఐపీఎల్ లో నేడు మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్.. నాలుగో మ్యాచ్ గెలవడంతో పాటు పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానానికి గురి పెట్టింది. ఇప్పటికే 6 విజయాలతో మూడో స్థానంలో ఉన్న కెఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో.. ఆరో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ను నేడు ఢీకొంటున్నది. ఇక ఈ లీగ్ లో ఏప్రిల్ 7న జరిగిన పోరులో తమను ఓడించిన లక్నోపై బదులు తీర్చుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తున్నది. ముంబై లోని వాంఖెడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో కెఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ సీజన్ లో హార్ధిక్ పాండ్యా, ఫాఫ్ డుప్లెసిస్ తర్వాత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మూడో సారథిగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో అవేశ్ ఖాన్ స్థానంలో కృష్ణప్ప గౌతమ్ వచ్చాడు. ఢిల్లీ జట్టులో మార్పులేమీ లేవు. గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే ఆడుతున్నారు.
పాయింట్ల పట్టికలో లక్నో ప్రస్తుతం మూడో స్థానం (9 మ్యాచులు.. 6 విజయాలు.. 3 ఓటములు.. 12 పాయింట్లు)లో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు మరింత దగ్గరవడమే గాక టాప్-2లో ఉన్న రాజస్తాన్ ను వెనక్కినెట్టి రెండో స్థానానికి చేరొచ్చు.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 8 మ్యాచులాడి 4 విజయాలు, అన్నే అపజయాలతో ఆరో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఆ జట్టుకు ఇకపై జరుగబోయే ప్రతి మ్యాచ్ కీలకమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాంఖెడే లో జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
బ్యాటింగ్, బౌలింగ్ లలో సమిష్టిగా రాణిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్.. గత మ్యాచులలో ప్రదర్శననే రిపీట్ చేయాలని కోరుకుంటున్నది. విజయాల వల్ల వైఫల్యాలు మరుగున పడుతున్నా.. బ్యాటింగ్ లో ఆ జట్టు కు మిడిలార్డర్ రాణించలేకపోవడం పెద్ద సమస్యగా మారింది. తొలుత పలు మ్యాచులలో భాగా ఆడిన ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్ లు సరైన హిట్టింగ్ చేయలేకపోతున్నారు. ఓపెనర్లలో ఎవరో ఒకరు (రాహుల్, డికాక్) తప్ప ఇద్దరూ కలిసి భారీ స్కోరు అందించలేకపోతున్నారు. ఈ లోపాలను ఇప్పటికైనా పూరించుకోవాలని లక్నో భావిస్తున్నది. బౌలింగ్ లో ఆ జట్టుకు అవేశ్ ఖాన్, చమీర, మోహిసిన్ ఖాన్ వంటి పేసర్లతో పాటు కృనాల్ పాండ్యా, బదోనిలు స్పిన్నర్లుగా ఆకట్టుకుంటున్నారు.
ఢిల్లీ విషయానికొస్తే.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా లు మంచి ఫామ్ లో ఉన్నారు. అయితే గత రెండు మ్యాచులలో షా విఫలమవుతుండటం ఆ జట్టుకు ఆందోళనకరంగా మారింది. మూడో స్థానంలో ఎవరు వస్తారనేదానిపై ఇప్పటికీ ఆ జట్టు కు స్పష్టత లేదు. కరోనా నుంచి కోలుకున్న మిచెల్ మార్ష్ ఆ స్థానంలో వచ్చినా గత మ్యాచ్ లో విఫలమయ్యాడు. అప్పుడప్పుడు అదే స్థానంలో పంత్ వస్తున్నా అతడిదీ అదే వరస. ఓపెనర్ గా డేవిడ్ వార్నర్ వరుసగా మంచి ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ లు కూడా రాణిస్తే లక్నో బౌలర్లకు కష్టమే. బౌలింగ్ లో ఆ జట్టు ప్రధానంగా స్పిన్నర్లమీదే ఎక్కువ ఆధారపడుతున్నది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లు ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ లు కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నా భారీగా పరుగులిచ్చుకుంటున్నారు.
- ఇరు జట్ల మధ్య ఐపీఎల్-15లో జరిగిన ఒకే ఒక మ్యాచ్ లో లక్నో నే విజయం వరించింది.
తుది జట్లు :
లక్నో సూపర్ జెయింట్స్ : క్వింటన్ డికాక్, కెఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, అయుష్ బదోని, జేసన్ హోల్డర్, దుష్మంత చమీర, మోహిసిన్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్
ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రొవ్మెన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మన్, చేతన్ సకారియా
