TATA IPL 2022: పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ కు మ్యాచ్ కు కొద్దిసేపటి ముందే భారీ షఫాక్ తగిలింది. ఆ జట్టు సీఈవో తో పాటు మరో ఇద్దరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
ఐపీఎల్-15లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (ఎంసీఎ) లో పంజాబ్ కింగ్స్ తో తలపడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు సీఈవో రఘు అయ్యర్ తో పాటు లక్నోకు మెంటార్ గా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్ మేనేజర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం మ్యాచ్ సందర్బంగా ముంబై నుంచి పూణే వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు లక్నో సూపర్ జెయింట్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
పంజాబ్ తో మ్యాచ్ ఆడేందుకు గాను లక్నో జట్టు.. పూణేకు బస్సులో బయల్దేరింది. గౌతం గంభీర్ తో పాటు జట్టు సభ్యులంతా వారి కోసం ప్రత్యేకించి కేటాయించిన బస్సులోనే పూణేకు ప్రయాణమయ్యారు. కానీ జట్టు సీఈవో రఘు అయ్యర్, అతడి అసోసియేట్ రచిత బెర్రి, గౌతం గంభీర్ మేనేజర్ గౌరవ్ అరోరా లు కార్ లో పూణేకు వెళ్లారు.
పూణేకు వెళ్తుండగా మార్గ మధ్యలో రఘు అయ్యర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురూ సాధారణ గాయాలతో బయటపడ్డారని లక్నో జట్టు తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఆ ముగ్గరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని.. త్వరలోనే వాళ్లు తమతో కలుస్తారని జట్టు వర్గాలు తెలిపాయి.
కాగా, ఐపీఎల్-15లో భాగంగా లక్నో.. పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో తలపడుతున్నది. ముంబైతో ముగిసిన గత మ్యాచ్ లో విజయం సాధించిన లక్నో అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన రాహుల్ సేన.. తొలుత బ్యాటింగ్ కు దిగింది.
