ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేదెలా..? అంపైర్ సిగ్నల్ ఎలా ఉంటుందంటే..!
IPL New Rules: ఈనెల 31 నుంచి మొదలుకాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 16వ ఎడిషన్ లో బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ అనే ఆప్షన్ ను ఈ సీజన్ లో వాడనున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త ఎడిషన్ మొదలవడానికి వారం రోజుల ముందుగానే బీసీసీఐ.. ఇందుకు సంబంధించిన పనులను చక్కబెట్టేస్తుంది. రాబోయే సీజన్ నుంచి ఐపీఎల్ లో కొత్త నిబంధనలను తీసుకురాబోతున్నట్టు బీసీసీఐ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో అందరినీ ఆకర్షిస్తున్న అంశం ‘ఇంపాక్ట్ ప్లేయర్’. మ్యాచ్ మధ్యలో ఎంట్రీ ఇవ్వబోయే ఈ క్రికెటర్ గురించి ప్రస్తుతం చర్చ జోరుగా సాగుతున్నది.
కాగా అసలు మ్యాచ్ జరిగేప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ ఎప్పుడొస్తాడు..? అతడిని ఎలా ఉపయోగించాలి..? అంటేవాటిమీద సీజన్ మొదలైతే గానీ ఒక అవగాహన రాదు. అన్నింటికంటే ముందు ఈ ప్లేయర్ ఫీల్డ్ లోకి రావడానికి సూచిక ఏంటి..? అన్నదానికి బీసీసీఐ తాజాగా సమాధానమిచ్చింది.
సిక్సర్, ఫోర్, ఔట్, నోబాల్, వైడ్ కు చేతి సూచికల ద్వారా అంపైర్లు వారి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ఎంట్రీ కూడా అంపైర్ల ‘చేతుల్లోనే’ ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ కోసం కెప్టెన్ ఆన్ ఫీల్డ్ అంపైర్లను కోరితే అప్పుడు సదరు ఆటగాడు క్రీజులోకి వస్తాడు. దీనికోసం కూడా ఓ సూచిక ఉంది. బీసీసీఐ తాజాగా ఇందుకు సంబంధించిన చిత్రాన్ని విడుదల చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్ ఆగమనాన్ని సూచించేందుకు గాను అంపైర్లు.. రెండు చేతులను తల పైకెత్తి (సిక్సర్ మాదిరిగా) అందులో ఒక చేతిని క్రాస్ పొజిషన్ లో పెడతారు. ఒక చేతి పిడికిలి బిగించి ఉంటుంది. మరో చేయి మాత్రం సమాంతరంగా ఉంటుంది. ఇదే ఇంపాక్ట్ ప్లేయర్ రాకకు సూచన. ఇందుకు సంబంధించిన చిత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
కొత్త నిబంధన ఇది:
తాజాగా ఐపీఎల్ 2023 సీజన్లో టాస్ అయిన తర్వాత ప్లేయింగ్ ఎలెవన్ని డిసైడ్ చేసే అవకాశం కల్పించనుంది బీసీసీఐ. సాధారణంగా టాస్ వేయడానికి ముందే ఇరు జట్ల కెప్టెన్లు, తమ ప్లేయింగ్ ఎలెవన్ని తీసుకొచ్చి, మ్యాచ్ రిఫరీకి సమర్పించాలి. అయితే టాస్ తర్వాత టీమ్ని నిర్ణయించుకునేందుకు అవకాశం కల్పించనుంది బీసీసీఐ. అంటే టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ చేయాలనుకుని ఓ 11 మందిని డిసైడ్ చేసిన కెప్టెన్, టాస్ ఓడిపోతే.. టీమ్లో మార్పులు చేసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ని కూడా టాస్ వేసిన తర్వాత డిసైడ్ చేసే ప్లేయింగ్ ఎలెవన్తోనే రిఫరీకి సమర్పించాలి.. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ఎప్పుడైనా ఓ ప్లేయర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ని ఆడించేందుకు ఫ్రాంఛైజీలకు అవకాశం ఉంటుంది.
10 ఫ్రాంఛైజీలతో మొదలైన ఐపీఎల్ 2022 సీజన్ అనుకున్నంతగా జనాదరణ దక్కించుకోలేకపోయింది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అట్టర్ ఫ్లాప్ కావడంతో పాటు పెద్దగా క్రేజ్ లేని కొత్త జట్లు గుజరాత్ జెయింట్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ చేరడం కూడా ఐపీఎల్ 2023 వ్యూయర్షిప్ని దెబ్బ తీసింది. దీంతో ఐపీఎల్ 2023 సీజన్కి క్రేజ్ తెచ్చేందుకు అదనపు హంగులు అద్దుతోంది బీసీసీఐ.