కరోనా వేళ... సన్ రైజర్స్ క్రికెటర్ పెద్ద మనసు..!
దేశంలో ఆక్సిజన్ కొరతతో కోవిడ్ బాధితులు అల్లాడుతున్న వేళ ప్రాణవాయువు సరఫరాకై రూ. 90 వేలు విరాళమిచ్చాడు.
భారత్ ని కరోనా పట్టిపీడిస్తోంది. ఈ సమయంలో చాలా మంది ఈ మహమ్మారితో తిప్పలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు శ్రీవత్సవ్ గోస్వామి పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనాతో పోరాడేందుకు భారత్ కి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. దేశంలో ఆక్సిజన్ కొరతతో కోవిడ్ బాధితులు అల్లాడుతున్న వేళ ప్రాణవాయువు సరఫరాకై రూ. 90 వేలు విరాళమిచ్చాడు. ఈ విషయాన్ని డొనాటేకర్ట్ అనే చారిటి ఆర్గనైజేషన్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. అత్యవసర సమయంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఇందుకు స్పందించిన శ్రీవత్స్.. కష్ట సమయంలో అందరూ ఏకతాటిపై నిలబడాలని, వీలైనంత మేర సాయం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.
కాగా ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ తన వంతు సాయంగా 50 వేల డాలర్లను పీఎం కేర్స్ఫండ్కు అందజేసిన విషయం తెలిసిందే. అదే విధంగా, ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ సైతం1 బిట్కాయిన్ను విరాళంగా అందించనున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో కరోనా సెకండ్వేవ్తో భారత్ అల్లాడుతున్న వేళ సాయం చేసేందుకు ముందుకు వచ్చిన తొలి స్వదేశీ క్రికెటర్గా శ్రీవత్స్ నిలిచాడు. దీంతో అతడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘వెల్డన్ శ్రీ భాయ్.. మా మనస్సుల్లో నీ స్థానం చెరిగిపోదు. కనీసం నువ్వైనా ముందుకు వచ్చావు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన శ్రీవత్స్ ఈ సీజన్లో ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.