డేవిడ్ వార్నర్ అవుట్పై వివాదం... థర్డ్ అంపైర్ తప్పు చేశాడంటున్న క్రికెట్ ఫ్యాన్స్...
17 బంతుల్లో 3 ఫోర్లతో 17 కొట్టిన డేవిడ్ వార్నర్...
సిరాజ్ బౌలింగ్లో కీపర్ క్యాచ్కి అవుట్గా ప్రకటించిన థర్డ్ అంపైర్...
రెండు నిమిషాల పాటు వీక్షించి మరీ, తప్పుడు నిర్ణయం ప్రకటించాడని అంటున్న క్రికెట్ ఫ్యాన్స్...
ఐపీఎల్ 2020 సీజన్లో కొనసాగుతున్న అంపైర్ వివాదాలు...
IPL 2020 సీజన్లో అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. థర్డ్ అంపైర్ నిర్ణయాలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కీలకమైన మొదటి ఎలిమినేటర్ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అవుట్పై వివాదం రేగింది. 17 బంతుల్లో 3 ఫోర్లతో 17 కొట్టిన డేవిడ్ వార్నర్... సిరాజ్ బౌలింగ్లో షాట్ ఆడబోయి బంతిని మిస్ అయ్యాడు. బంతి నేరుగా కీపర్ డివిల్లియర్స్ చేతుల్లోకి వెళ్లింది.
వికెట్ కీపర్తో పాటు ఆర్సీబీ ప్లేయర్లు అందరూ అవుట్కి అప్పీలు చేశారు. అంపైర్ మాత్రం బ్యాట్కి తగలలేదనే ఉద్దేశంతో నాటౌట్గా ప్రకటించాడు. ఆలస్యం చేయకుండా రివ్యూకి వెళ్లాడు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. టీవీ రిప్లైలో బంతి బ్యాటును మిస్ అవుతున్నట్టు క్లియర్గా కనిపించింది. అయితే వార్నర్ గ్లవ్స్ను తాకుతుందా? లేదా? అనే అనుమానంతో చాలాసేపు గమనించాడు థర్డ్ అంపైర్.
ఆఖరికి బంతి గ్లవ్స్కి తగులుతోందని కన్ఫార్మ్ చేసుకుని అవుట్గా ప్రకటించాడు థర్డ్ అంపైర్. దీంతో 43 పరుగుల వద్ద కీలకమైన డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయింది సన్రైజర్స్ హైదరాబాద్. అయితే థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయం సరైనది కాదని వాదిస్తున్నారు నెటిజన్లు.
బ్యాట్కి బంతి తగలనప్పుడు ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద బ్యాట్స్మెన్కి అనుకూలంగా నిర్ణయం ఇవ్వాల్సిన అంపైర్, ఇలాంటి నిర్ణయం ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేసిందని అంటున్నారు. ఫీల్డ్ అంపైర్ తప్పు చేస్తే రివ్యూకి వెళ్లొచ్చు, అదే థర్డ్ అంపైర్ కూడా ఇలాంటి తప్పు చేస్తే ఏం చేయాలని అంటున్నారు క్రికెట్ అభిమానులు.