India vs South Africa 3rd test: తొలి వికెట్ తీసిన జస్ప్రిత్ బుమ్రా... సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ అవుట్... కీలకంగా మారిన రెండో రోజు ఆట...
టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది ఆతిథ్య సౌతాఫ్రికా జట్టు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 223 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలెట్టిన సౌతాఫ్రికాకి ఆరంభంలోనే షాక్ తగిలింది...
అద్భుతమైన ఫామ్లో ఉన్న సౌతాఫ్రికా టెస్టు సారథి డీన్ ఎల్గర్ 16 బంతుల్లో 3 పరుగులు చేసి జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్లో ఛతేశ్వర్ పూజారాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సఫారీ జట్టు. ఆ తర్వాత అయిడిన్ మార్క్రమ్, కేశవ్ మహరాజ్ వికెట్ పడకుండా బ్యాటింగ్ చేశారు. మార్క్రమ్ 8, కేశవ్ మహరాజ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 206 పరుగుల దూరంలో ఉంది సౌతాఫ్రికా...
అంతకుముందు భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మంచి ఫామ్లో ఉన్న ఓపెనర్ కెఎల్ రాహుల్ 35 బంతుల్లో ఓ ఫోర్తో 12 పరుగులు చేసి అవుట్ కాగా, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 35 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...
డాన్నే ఓలీవర్, కెఎల్ రాహుల్ వికెట్ తీయగా, కగిసో రబాడాకి మయాంక్ అగర్వాల్ వికెట్ దక్కింది. 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా కలిసి మూడో వికెట్కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాని ఆదుకున్నారు.
77 బంతుల్లో 7 ఫోర్లతో 43 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, మార్కో జాన్సెన్ బౌలింగ్లో వికెట్ కీపర్ వెరెన్నేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 95 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఆ తర్వాత 12 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన అజింకా రహానే, కగిసో రబాడా బౌలింగ్లో పెవిలియన్ చేరాడు...
116 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది భారత జట్టు. రబాడా బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన విరాట్ కోహ్లీ, 2018 తర్వాత విదేశీ గడ్డపై తొలి సిక్సర్ నమోదుచేశాడు. 2020 జనవరి నుంచి టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఓవరాల్గా ఇది రెండో సిక్సర్ మాత్రమే...
అజింకా రహానే అవుటైన తర్వాత రిషబ్ పంత్తో కలిసి ఐదో వికెట్కి 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు విరాట్ కోహ్లీ. 50 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేసిన రిషబ్ పంత్, మార్కో జాన్సెన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 10 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి జాన్సెన్ బౌలింగ్లోనే అవుట్ కావడంతో 175 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది టీమిండియా...
ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ 9 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్తో 12 పరుగులు చేసి అవుట్ కాగా, జస్ప్రిత్ బుమ్రా 9 బంతులాడి డకౌట్ అయ్యాడు...
159 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, టెస్టు కెరీర్లో రెండో అతి నెమ్మదైన అర్ధశతకం నమోదు చేశాడు... అవతలి ఎండ్లో వరుస వికెట్లు పడడంతో సింగిల్స్ తీయలేక, నాన్స్ట్రైయికర్లకు స్ట్రైయిక్ ఇవ్వలేక ఇబ్బంది పడిన విరాట్ కోహ్లీ... 201 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్తో 79 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
70వ సెంచరీ తర్వాత విరాట్ కోహ్లీకి టెస్టుల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఉమేశ్ యాదవ్ 14 బంతుల్లో 4 పరుగులతో నాటౌట్గా నిలవగా, మహ్మద్ షమీ 20 బంతుల్లో ఓ ఫోర్తో 7 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో 77.3 ఓవర్లలోనే భారత ఇన్నింగ్స్ ముగిసింది.
