INDvSA 2nd ODI: టాస్ గెలిచిన టీమిండియా... సిరీస్ నిలవాలంటే తప్పక గెలవాల్సిందే...
India vs South Africa: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెఎల్ రాహుల్... టీమిండియాను వెంటాడుతున్న మిడిల్ ఆర్డర్ వైఫల్యం...
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కెఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి వన్డేలో టాస్ ఓడి, మ్యాచ్ ఓడిన భారత జట్టు, నేటి మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితులో పడింది. మొదటి వన్డేలో 31 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ నిలుపుకోవాలని చూస్తోంది. మరోవైపు వరుసగా రెండు టెస్టులతో పాటు మొదటి వన్డే గెలిచిన సౌతాఫ్రికా, ఆ విజయాల పరంపరను కొనసాగించాలని చూస్తోంది...
కెప్టెన్గా కెఎల్ రాహుల్కి పెద్దగా మార్కులు పడలేదు. ముఖ్యంగా తొలి వన్డేలో భారత జట్టును మిడిల్ ఆర్డర్ వైఫల్యం బాగా వెంటాడింది. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ భాగస్వామ్యంతో దాదాపు సగం స్కోరు చేసేసినా... మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ ఘోరంగా విఫలమయ్యారు...
ఆఖర్లో శార్దూల్ ఠాకూర్ మెరుపులతో హాఫ్ సెంచరీ చేసి ఒంటరి ప్రయత్నం చేసినా, ఓటమి తేడాను తగ్గించగలిగాడంతే.. టాస్ గెలిచినప్పటి మిడిల్ ఆర్డర్ ఎలా రాణిస్తారనేదానిపైనే భారత జట్టు స్కోరు ఆధారపడి ఉంది. బీభత్సమైన ఫామ్లో ఉన్న యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్కి మరోసారి నిరాశే ఎదురైంది...
ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా భారత జట్టులో చోటు దక్కించుకున్న వెంకటేశ్ అయ్యర్ నుంచి ఇప్పటిదాకా సరైన పర్ఫామెన్స్ అయితే రాలేదు. ఐపీఎల్లో ఓపెనర్గా, పేస్ ఆల్రౌండర్గా అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్ను సరిగా వాడుకోవడం అటు రోహిత్ శర్మకి, ఇటు కెఎల్ రాహుల్కి కానీ తెలియడం లేదనేది వాస్తవం... ఫ్యూచర్ కెప్టెన్గా గుర్తింపు దక్కించుకున్న కెఎల్ రాహుల్, గత మ్యాచ్లో బ్యాటుతో కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు.
తొలి వన్డేలో వెంకటేశ్ అయ్యర్కి ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు కెప్టెన్ కెఎల్ రాహుల్. భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్ భారీగా పరుగులు ఇస్తున్నా, వారినే కొనసాగించి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అలాగే శార్దూల్ ఠాకూర్ బ్యాటుతో ఆకట్టుకున్నా, బాల్తో పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. భువనేశ్వర్ కుమార్ అయితే అటు బ్యాటుతో, ఇటు బాల్తో రాణించలేకపోయాడు...
కెప్టెన్గా కెఎల్ రాహుల్, గత మ్యాచ్లో 70+ స్కోరు చేసి ఆకట్టుకున్న శిఖర్ ధావన్ ఓపెనర్లుగా కొనసాగుతుండడంతో రుతురాజ్ గైక్వాడ్కి మరోసారి అవకాశం దక్కలేదు. అలాగే సౌతాఫ్రికా జట్టు ఒకే ఒక్క మార్పుతో రెండో వన్డే బరిలో దిగుతోంది... బౌలర్ మార్కో జాన్సన్ స్థానంలో సిసిండ మగలకి చోటు దక్కింది.
సౌతాఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), జన్నెమన్ మలాన్, అయిడిన్ మార్క్రమ్, రస్సీ వాన్ దేర్ దుస్సేన్, తెంబ భవుమ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అదిల్ ఫుహ్లుక్వాయో, సిసిండ మగల, కేశవ్ మహరాజ్, తాబ్రేజ్ షంసీ, లుంగీ ఇంగిడీ
భారత జట్టు: కెఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, యజ్వేంద్ర చాహాల్