వెస్టిండిస్ తో జరుగుతుతున్న టెస్ట్ సీరిస్ ద్వారా రోహిత్ కు చెక్ పెట్టాలన్న కోహ్లీ ప్లాన్ ఫలించింది. మొదటి టెస్ట్ లో రోహిత్ ను ఎందుకు ఆడించడంలేదన్న సీనియర్ల ప్రశ్నలకు కోహ్లీ గెలుపుతోనే జవాభిచ్చాడు.
వెస్టిండిస్ తో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 318 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తుచేసి భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఐదో అతిపెద్ద విజయాన్ని అందుకుంది. ఈ విజయం ద్వారా సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ ను కోహ్లీ సక్సెస్ఫుల్ గా ఈ టెస్ట్ సీరిస్ కు దూరం చేయగలిగాడు. మాజీల సూచనలను సైతం లెక్కచేయకుండా తొలి టెస్ట్ లో రోహిత్ ను పక్కనబెడుతూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. తాజా విజయంతో తాను తీసుకున్న నిర్ణయమే సరైనదని అదే మాజీలు ఒప్పుకునేలా కోహ్లీ చేశాడు.
ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు జట్టు కూర్పు సరిగ్గా లేదంటూ కొందరు మాజీలు చేసిన విమర్శలను కోహ్లీ ఈ విజయంతో ధీటుగా జవాభిచ్చాడు. ముఖ్యంగా రోహిత్ ను కాదని అవకాశం కల్పించిన వైస్ కెప్టెన్ అజింక్య రహానే, హనుమ విహారీలు అద్భుతంగా రాణించారు. నిజంగా చెప్పాలంటే వీరిద్దరి వల్లే జట్టు ఇంత పెద్ద విజయాన్ని అందుకుందనడంలో అతిశయోక్తి లేదు.
వెస్టిండిస్ బౌలర్లు విజృంభించిన మొదటి ఇన్నింగ్స్ లో వైస్ కెప్టెన్ రహానే ఒంటరిపోరాటంతో చేశాడు. అతడొక్కడే హాఫ్ సెంచరీ(81 పరుగులు)తో రాణించాడు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో అయితే సెంచరీ(102 పరుగులు) సాధించి జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. ఇక మరో ఆటగాడు హనుమ విహారీ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 32 పరుగులతో పరవాలేదనిపించినా సెకండ్ ఇన్నింగ్స్ లో 93 పరుగులతో అదరగొట్టాడు. దీంతో భారత్ తిరుగులేని విజయాన్ని అందుకోవడంతో పాటు రోహిత్ ను పక్కనబెట్టడంలో కోహ్లీ సక్సెస్ అయ్యాడు.
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ రహానే, విహారీలపై ప్రశంసలు కురిపించాడు. వారిద్దరు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని అన్నాడు. తమ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అదరగొట్టిన వారిద్దరికి జట్టులో కొనసాగడానికి అన్నివిధాలా అర్హులని అన్నాడు. ఇలా తదుపరి మ్యాచ్ కు కూడా రోహిత్ దూరమవనున్నాడని కోహ్లా పరోక్షంగా వెల్లడించాడు.
