దాదాపు 2 గంటల పాటు నిలిచిన ఆట... 23 ఓవర్లలో టీమిండియా టార్గెట్ని 145 పరుగులుగా నిర్ణయించిన అంపైర్లు..
వర్షం కారణంగా ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దు కాగా, నేపాల్తో జరిగిన మ్యాచ్ టీ20 మ్యాచ్గా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యఛేదనలో టీమిండియా 2.1 ఓవర్లలో 17 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం కురవడంతో దాదాపు 2 గంటల పాటు ఆట నిలిచిపోయింది..
వర్షం తగ్గిన తర్వాత అవుట్ ఫీల్డ్ని ఆరబెట్టేందుకు సమయం పట్టడంతో రాత్రి 10 గంటల 15 నిమిషాలకు ఆట తిరిగి ప్రారంభమైంది. డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం టీమిండియా లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్ణయించారు అంపైర్లు. అంటే మిగిలిన 20.5 ఓవర్లలో టీమిండియా 128 పరుగులు చేయాల్సి ఉంటుంది.
అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా, ఫీల్డింగ్ తప్పిదాలు, క్యాచ్ డ్రాప్లతో భారీ మూల్యం చెల్లించుకుంది. పాక్తో మ్యాచ్లో 104 పరుగులకే ఆలౌట్ అయిన నేపాల్, 48.2 ఓవర్లు బ్యాటింగ్ చేసి 230 పరుగుల స్కోరు చేయగలిగింది. మొదటి 5 ఓవర్లలో టీమిండియా ఫీల్డర్లు 3 క్యాచులను డ్రాప్ చేశారు. దీన్ని వాడుకున్న నేపాల్ ఓపెనర్లు 9.5 ఓవర్లలో తొలి వికెట్కి 65 పరుగుల భాగస్వామ్యం జోడించారు..
25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసిన కుశాల్ బుర్టెల్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో ఇషాన్ కిషన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 17 బంతుల్లో 7 పరుగులు చేసిన భీం శక్తిని రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. 8 బంతుల్లో 5 పరుగులు చేసిన నేపాల్ కెప్టెన్ రోహిత్ పాడెల్ కూడా జడ్డూ బౌలింగ్లో రోహిత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
5 బంతుల్లో 2 పరుగులు చేసిన కుశాల్ మల్ల, జడ్డూ బౌలింగ్లో సిరాజ్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వెంటవెంటనే 3 వికెట్లు కోల్పోయింది నేపాల్. 65/0 స్థితిలో ఉన్న నేపాల్, 101/4 స్థితికి చేరుకుంది. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో కుదురుకుపోయిన ఓపెనర్ ఆసిఫ్ షేక్ 97 బంతుల్లో 8 ఫోర్లతో 58 పరుగులు చేసి హాఫ్ సెంచరీ అందుకున్నాడు..
హాఫ్ సెంచరీ తర్వాత సిరాజ్ బౌలింగ్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఆసిఫ్ షేక్. 35 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేసిన గుల్షాన్ జా కూడా మహ్మద్ సిరాజ్ బౌలింగ్లోనే ఇషాన్ కిషన్ పట్టిన క్యాచ్కి పెవిలియన్ చేరాడు.
144 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది నేపాల్. 37.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసిన సమయంలో వర్షం కారణంగా కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. మ్యాచ్ తిరిగి ప్రారంభమైన తర్వాత దీపేంద్ర సింగ్ని హార్ధిక్ పాండ్యా ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు.
25 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేసిన దీపేంద్ర సింగ్, డీఆర్ఎస్ తీసుకున్నా ఫలితం లేకపోయింది. 56 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసిన సోమ్పాల్ కమి, మహ్మద్ షమీ బౌలింగ్లో ఇషాన్ కిషన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. అదే ఓవర్లో 17 బంతుల్లో 9 పరుగులు చేసిన సందీప్ లామిచానే రనౌట్ అయ్యాడు.
