రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా... 8 వికెట్కి అజేయంగా 71 పరుగులు జోడించిన శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్...
బంగ్లా టూర్ను టీమిండియా విజయంతో ముగించింది. రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో గెలిచి 2-0 తేడాతో టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది. ఓవర్నైట్ స్కోరు 45/4 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు... 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.. అయితే రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్ కలిసి 8వ వికెట్కి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా ఘన విజయాన్ని అందించారు...
శ్రేయాస్ అయ్యర్ 46 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేయగా రవిచంద్రన్ అశ్విన్ 62 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్తో 42 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా విజయానికి 16 పరుగులు కావాల్సిన దశలో మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో 6, 2, 4,4 బాది మ్యాచ్ని ముగించాడు రవిచంద్రన్ అశ్విన్...
16 బంతుల్లో 13 పరుగులు చేసిన జయ్దేవ్ ఉనద్కట్ని షకీబ్ అల్ హసన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 13 బంతుల్లో ఓ ఫోర్తో 9 పరుగులు చేసిన రిషబ్ పంత్, మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. 69 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేసిన అక్షర్ పటేల్ని మెహిదీ హసన్ మిరాజ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది భారత జట్టు..
అంతకుముందు 145 పరుగుల ఈజీ టార్గెట్తో నాలుగో ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. బౌలింగ్కి అనుకూలిస్తున్న పిచ్లో బంగ్లా బౌలర్లు చెలరేగిపోవడంతో 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు... ఫామ్లో శుబ్మన్ గిల్, గత మ్యాచ్లో సెంచరీ చేసిన ఛతేశ్వర్ పూజారా, ఆదుకుంటాడనుకున్న విరాట్ కోహ్లీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇప్పటికే పెవిలియన్ చేరారు...
2 పరుగులు చేసిన కెఎల్ రాహుల్ని షకీబ్ అల్ హసన్ అవుట్ చేయడంతో 3 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఆ తర్వాత ఛతేశ్వర్ పూజారా 6 పరుగులు చేసి మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు. 35 బంతుల్లో 7 పరుగులు చేసిన శుబ్మన్ గిల్ కూడా మెహిదీ హసన్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు...
వెంటవెంటనే రెండు వికెట్లు పడడంతో అక్షర్ పటేల్ నాలుగో స్థానంలో నైట్ వాచ్మెన్గా క్రీజులోకి వచ్చాడు. గిల్ అవుట్ కావడంతో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు. 22 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ కూడా మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్లోనే జాకీర్ హసన్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. విరాట్ అవుట్ అయ్యే సమయానికి 3 ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉండడంతో జయ్దేవ్ ఉనద్కట్కి బ్యాటింగ్కి పంపించింది భారత జట్టు. అంతకుముందు బంగ్లాదేశ్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 231 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
