టీమిండియాని భయపెడుతున్న బంగ్లా... మరో ఘోర ఓటమి తప్పదా!
74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా... అక్షర్ పటేల్, రిషబ్ పంత్ అవుట్... అయ్యర్పై భారం వేసిన టీమిండియా..
బంగ్లా టూర్లో మొదటి రెండు వన్డేల్లో ఓడిన టీమిండియా... రెండో టెస్టులోనూ పీకల్లోతు కష్టాల్లోపడింది. 145 పరుగుల టార్గెట్తో నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా...వరుస వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓవర్నైట్ స్కోరు 45/4 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు... 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది..
జయ్దేవ్ ఉనద్కట్ 13 పరుగులు చేసి అవుట్ కాగా భారీ అంచనాలు పెట్టుకున్న రిషబ్ పంత్ 9 పరుగులకే అవుట్ అయ్యాడు. 34 పరుగులు చేసిన అక్షర్ పటేల్ని బౌల్డ్ చేసిన మెహిదీ హసన్ మిరాజ్ ఐదు వికెట్లు తీసి... భారత బ్యాటింగ్ ఆర్డర్ని కకావికలం చేశాడు.
145 పరుగుల ఈజీ టార్గెట్తో నాలుగో ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. బౌలింగ్కి అనుకూలిస్తున్న పిచ్లో బంగ్లా బౌలర్లు చెలరేగిపోవడంతో 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు... ఫామ్లో శుబ్మన్ గిల్, గత మ్యాచ్లో సెంచరీ చేసిన ఛతేశ్వర్ పూజారా, ఆదుకుంటాడనుకున్న విరాట్ కోహ్లీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇప్పటికే పెవిలియన్ చేరారు...
2 పరుగులు చేసిన కెఎల్ రాహుల్ని షకీబ్ అల్ హసన్ అవుట్ చేయడంతో 3 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఆ తర్వాత ఛతేశ్వర్ పూజారా 6 పరుగులు చేసి మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు. 35 బంతుల్లో 7 పరుగులు చేసిన శుబ్మన్ గిల్ కూడా మెహిదీ హసన్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు...
వెంటవెంటనే రెండు వికెట్లు పడడంతో అక్షర్ పటేల్ నాలుగో స్థానంలో నైట్ వాచ్మెన్గా క్రీజులోకి వచ్చాడు. గిల్ అవుట్ కావడంతో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు. 22 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ కూడా మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్లోనే జాకీర్ హసన్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. విరాట్ అవుట్ అయ్యే సమయానికి 3 ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉండడంతో జయ్దేవ్ ఉనద్కట్కి బ్యాటింగ్కి పంపించింది భారత జట్టు.
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 7/0 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన బంగ్లాదేశ్ జట్టు 70.2 ఓవర్లలో 231 పరుగులకి ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్లో దక్కిన ఆధిక్యం పోగా టీమిండియా ముందు 145 పరుగుల టార్గెట్ని పెట్టింది.. 31 బంతుల్లో ఓ ఫోర్తో 5 పరుగులు చేసిన నజ్ముల్ హుస్సేన్ షాంటో, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు...
5 పరుగులు చేసిన మోమినుల్ హక్ని మహ్మద్ సిరాజ్ అవుట్ చేయగా షకీబ్ అల్ హసన్ 13 పరుగులు చేసి జయ్దేవ్ ఉదన్కట్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ముస్తాఫికర్ రహీం 9 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ కావడంతో లంచ్ బ్రేక్ సమయానకి ముందే 4 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్.. 135 బంతుల్లో 5 ఫోర్లతో 51 పరుగులు చేసిన జాకీర్ హుస్సేన్, హాఫ్ సెంచరీ నమోదు చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు..
మెహిదీ హసన్ మిరాజ్ డకౌట్ కావడంతో 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్. ఈ దశలో నురుల్ హసన్ 29 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 31 పరుగులు చేసి ఏడో వికెట్కి 48 పరుగులు జోడించాడు. 98 బంతుల్లో 7 ఫోర్లతో 73 పరుగులు చేసిన లిటన్ దాస్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
టస్కిన్ అహ్మద్ 46 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా తైజుల్ ఇస్లాంను అశ్విన్ అవుట్ చేశాడు. ఖలీద్ అహ్మద్ రనౌట్ కావడంతో 231 పరుగుల వద్ద బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు తీయగా అశ్విన్, సిరాజ్లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఉమేశ్ యాదవ్, జయ్దేవ్ ఉనద్కట్ తలా ఓ వికెట్ తీశారు.