ఆసిస్ పై టీమిండియా విజయం: కోహ్లీ నమ్మకాన్ని నిలబెట్టింది...ఆ నలుగురే
మూడో వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియాను చిత్తుచేసిన కోహ్లీసేన ఎట్టకేలకు విజయాల బోణీ కొట్టింది.
స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరుగుతున్న వన్డే సీరిస్ లో టీమిండియా వరుసగా రెండు ఓటముల తర్వాత విజయాన్ని అందుకుంది. మూడో వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియాను చిత్తుచేసిన కోహ్లీసేన ఎట్టకేలకు విజయాల బోణీ కొట్టింది. కెప్టెన్ కోహ్లీ జట్టులో చేసిన మార్పులే ఈ విజయాన్ని అందించాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
మొదటి రెండు వన్డేల్లో ఆడిన జట్టుతో కాకుండా మూడో వన్డేలో మార్పులు చేపట్టారు కోహ్లీ. ఇది ఫలితాన్నిచ్చింది. మొత్తంగా మొదటి రెండు మ్యాచులు ఆడిన జట్టులోంచి నలుగురు ఆటగాళ్లను పక్కనబెట్టడం టీమిండియాకు కలిసొచ్చింది.
స్టార్ బౌలర్ మహ్మద్ షమీ విశ్రాంతి తీసుకోగా మొదటి రెండు వన్డేల్లో ఘోరంగా విఫలమైన బౌలర్లు యుజ్వేంద్ర చాహల్, నవ్దీప్ సైనిలను మూడో వన్డేల్లో ఆడే అవకాశం దక్కలేదు. అలాగే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా మొదటి రెండు వన్డేల్లో ఆడినా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకలేకపోయాడు. దీంతో వీరి స్థానాల్లో శుభ్మన్ గిల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, నటరాజన్ లకు మూడో వన్డే ఆడే అవకాశం వచ్చింది. కెప్టెన్ కోహ్లీ పెట్టుకున్న నమ్మకాన్ని వీరు వమ్ము చేయలేదు.
ఓపెనర్గా వచ్చి ఐపీఎల్ ఫామ్ను కొనసాగిస్తూ క్రీజులో ఉన్నంతసేపు ఆత్మవిశ్వాసంతో శుభ్ మన్ గిల్ బ్యాటింగ్ చేశాడు. గిల్ 33 పరుగులు చేయడంతో టీమిండియాకు మంచి శుభారంభం లభిచింది. శార్దూల్ ప్రమాదకరైన స్మిత్, హెన్రిక్స్, అబాట్ల వికెట్లు పడగొట్టాడు. అరంగేట్ర వన్డేలోనే నటరాజన్ అదరగొట్టి ఆకట్టుకున్నాడు. ఆరంభంలో ఓపెనర్ లబుషేన్, మ్యాచ్ చివర్లో అగర్ వికెట్ను కూడా తీశాడు. ఇక ఆస్ట్రేలియా పరుగుల వేగాన్ని తగ్గించి భారత విజయంలో కీలకంగా వ్యవహరించారు కుల్దీప్ యాదవ్. ఇలా కోహ్లీ జట్టులో చేసిన మార్పులు భారత్ కు విజయాన్ని అందించారు.