ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 300 మార్కు దాటేసిన ఆస్ట్రేలియా.. ఐదో వికెట్కి రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన ఉస్మాన్ ఖవాజా- కామెరూన్ గ్రీన్...
ఇండోర్ టెస్టులో గెలిచి 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కమ్బ్యాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా... అహ్మదాబాద్లో జరుగుతున్న ఆఖరి టెస్టులోనూ పట్టు బిగిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, 108 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 300 పరుగులు సాధించింది...
ఓవర్నైట్ స్కోరు 255/4 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియాని భారత బౌలర్లు ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోతున్నారు. మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్... ఇలా ఇన్ని బౌలింగ్ మార్పులు చేసినా టీమిండియాకి వికెట్ మాత్రం దక్కడం లేదు...
49 పరుగుల వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన కామెరూన్ గ్రీన్, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. మొదటి రోజు సెంచరీ బాదిన ఉస్మాన్ ఖవాజా.. దూకుడు పెంచాడు. కామెరూన్ గ్రీన్ 106 బంతుల్లో 9 ఫోర్లతో 66 పరుగులు చేయగా ఉస్మాన్ ఖవాజా 323 బంతుల్లో 18 ఫోర్లతో 133 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్కి అజేయంగా 131 పరుగుల భాగస్వామ్యం జోడించారు..
ఈ సిరీస్లో ఏ వికెట్కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ కలిసి 8వ వికెట్కి 114 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసిన ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ గ్రీన్... ఆస్ట్రేలియాకి భారీ స్కోరు అందించే దిశగా సాగుతున్నారు. ఈ భాగస్వామ్యాన్ని వీలైనంత త్వరగా విడదీసి, ఆస్ట్రేలియాని ఆలౌట్ చేయకపోతే భారత జట్టు కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది..
