IND vs SA: కీలక మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా.. ఓడితే సిరీస్ సఫారీలదే
IND vs SA 2nd ODI: శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు నేడు రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో వన్డే ఆడుతున్నది. ఇప్పటికే తొలి మ్యాచ్ ఓడిన భారత్.. ఈ మ్యాచ్ లోనూ ఓడితే సిరీస్ కోల్పోయే ప్రమాదముంది.
ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు రాంచీ వేదికగా నిర్వహిస్తున్న రెండో వన్డేలో శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేయనున్నది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కు రానున్నది. ఇప్పటికే లక్నోలో ముగిసిన తొలి మ్యాచ్ లో ఓడిన భారత జట్టు నేటి మ్యాచ్ లో కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేస్తే సిరీస్ గోవిందా. మరి కీలకమైన ఈ మ్యాచ్ లో భారత జట్టు ఎలా ఆడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దాదాపు ద్వితీయ శ్రేణి జట్టే అయినా టీమిండియాలో ఉన్న చాలా మంది ఆటగాళ్లు సీనియర్ జట్టుకు కూడా ఆడినవారే. అదీగాక తొలి మ్యాచ్ లో భారత్.. అనుభవం లేని ఆటగాళ్లతో అయినా విజయానికి దగ్గరగా వచ్చింది. మరి నేటి మ్యాచ్ లో ధావన్ అండ్ కో ఏం చేస్తారో చూడాలి.
గత మ్యాచ్ లో బరిలోకి దిగిన జట్లలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. సఫారీ కెప్టెన్ టెంబ బవుమాతో పాటు స్పిన్నర్ షంషీ ఈ మ్యాచ్ ఆడటం లేదు. వారి స్థానంలో రీజా హెండ్రిక్స్, ఫార్ట్యూన్ తుది జట్టులోకి వచ్చారు. కేశవ్ మహారాజ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
ఇక భారత జట్టు విషయానికొస్తే రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్ స్థానాలలో వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్ లు తుది జట్టుతో చేరారు.
తుది జట్లు:
టీమిండియా : శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మద్
దక్షిణాఫ్రికా : కేశవ్ మహారాజ్ (కెప్టెన్), జానేమన్ మలన్, క్వింటన్ డికాక్, మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సేన్, కగిసొ రబాడా, లుంగి ఎంగిడి, రీజా హెండ్రిక్స్, ఫార్ట్యూన్