INDvsAUS: స్వదేశంలో ఈ ఏడాది అక్టోబర్ లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ వరకూ టీమిండియాకు సారథిగా రోహిత్ శర్మే ఉంటాడు. కానీ ఆ తర్వాత అతడు కొనసాగడం అనేది అనుమానమే.
ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ దిశగా సాగుతోంది టీమిండియా. 20 మంది ప్లేయర్లతో కూడిన ఓ ప్రత్యేకమైన కోర్ గ్రూప్ ను ఏర్పాటు చేసి వారితోనే మ్యాచ్ లను ఆడిస్తున్నది. వరల్డ్ కప్ వరకూ టీమిండియాకు సారథిగా రోహిత్ శర్మే ఉంటాడు. కానీ ఆ తర్వాత అతడు కొనసాగడం అనేది అనుమానమే. వయసు భారం, జట్టులోకి యువ ఆటగాళ్లు దూసుకొస్తుండటంతో ఇప్పటికే టీ20లలో సీనియర్లను పక్కనబెట్టిన టీమ్ మేనేజ్మెంట్.. వన్డే వరల్డ్ కప్ తర్వాత రోహిత్ తో కూడా మాట్లాడనుందని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు..? అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. తాజాగా టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ దీనిపై స్పందిచాడు. రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు..? అన్న చర్చే వస్తే తాను మాత్రం హార్ధిక్ పాండ్యాకే ఓటేస్తానని చెప్పాడు.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిసి ఈనెల 17 నుంచి వన్డే సిరీస్ మొదలుకానున్న నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన టీవీ కార్యక్రమంలో గవాస్కర్ మాట్లాడుతూ...‘కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యా తన టీమ్ మెంబర్స్ తో చాలా కంఫర్ట్ గా ఉంటాడు. అతడు ఆటగాళ్లను హ్యాండిల్ చేసే విధానం బాగుంటుంది. ప్రతీ ఆటగాడి దగ్గరికి వెళ్లి వాళ్ల భుజానికి భుజం కలిపి మాట్లాడే విధానంతో వారికి ఎంతో ఓదార్పునిస్తుంది. ఇది ప్రతీ ఆటగాడు తన సహజమైన ఆట ఆడటానికి సహకరిస్తుంది.
వాస్తవానికి మిడిలార్డర్ లో హార్ధిక్ పాండ్యా చాలా ప్రభావం చూపగల ఆటగాడు. అతడు ఒక గేమ్ ఛేంజర్. తాను సారథిగా ఉన్న ఐపీఎల్ లో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడుతూ అతడు బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చి ఆడాడు. ఇది ఆ జట్టుకు ఎంతగానో ఉపకరించింది. అతడి కెప్టెన్సీ నన్ను చాలా ఆకట్టుకున్నది. ముంబైలో ఆసీస్ తో జరుగబోయే మ్యాచ్ లో గనక గెలిస్తే ప్రపంచకప్ తర్వాత హార్ధికే భారత జట్టు సారథిగా ఉంటాడని నేను నమ్ముతున్నా...’అని చెప్పాడు.
కాగా ఆస్ట్రేలియాతో మార్చి 17న మొదలయ్యే తొలి వన్డేలో హార్ధిక్ పాండ్యా సారథిగా ఉండనున్నాడు. వ్యక్తిగత కారణాలతో రోహిత్.. తొలి వన్డేకు దూరంగా ఉండనున్నాడు. తర్వాత రెండు వన్డేలకు జట్టుతో కలుస్తాడు.
గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు టీ20లలో సారథిగా వ్యవహరించిన పాండ్యా.. ఈ ఏడాది జనవరి నుంచి స్వదేశంలో దాదాపుగా పూర్తి స్థాయి సారథిగా ఎంపికయ్యాడు. ఇటీవల చేతన్ వర్మ స్టింగ్ ఆపరేషన్ వీడియోలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్ లలో అతడే కెప్టెన్ గా వ్యవహరించాడు. వన్డేలలో హార్థిక్ భారత్ కు సారథిగా వ్యవహరించనుండటం ఇదే ప్రథమం.
