IPL 2023: ముస్లింల పవిత్ర స్థలం మక్కా నగరం కొలువుతీరిన సౌదీ అరేబియాలో మరో క్రీడా విప్లవం. ఇప్పటికే ఫుట్బాల్, ఫార్ములా 1 గ్రాండ్ ప్రీ తో క్రీడాకారులను ఆకర్షిస్తున్న ఆ దేశం మరో అడుగు ముందుకేసింది.
ప్రపంచ క్రికెట్ బోర్డులలో సంపన్న బోర్డుగా వెలుగొందుతున్న బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) యజమానులకు బంపరాఫర్. ముస్లింల పవిత్ర నగరం మక్కా కొలువుదీరిన సౌదీ అరేబియాలో ప్రపంచంలోనే బిగ్గెస్ట్, రిచెస్ట్ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఇదివరకే ఐపీఎల్ ఓనర్లతో సౌదీ ప్రతినిధులు చర్చలు సాగించినట్టు.. త్వరలోనే దీనికి తుది రూపు ఇవ్వనున్నట్టు సమాచారం.
పలు జాతీయ వెబ్ సైట్స్ లో వస్తున్న కథనాల మేరకు.. సౌదీ అరేబియాలో క్రికెట్ ను ప్రోత్సహించేందుకు గాను ఇక్కడ ఐపీఎల్ మాదిరిగా భారీ టీ20 క్రికెట్ లీగ్ ను నిర్వహించేందుకు సన్నాహకాలు చకచకా జరుగుతున్నాయి. ఏడాది క్రితం నుంచే దీనిపై గ్రౌండ్ వర్క్ చేస్తున్న సౌదీ.. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది నుంచి సౌదీలో టీ20 లీగ్ మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఐపీఎల్ ఓనర్లు, ప్లేయర్లకు ఎర..
తమ దేశంలో నిర్వహించబోయే క్రికెట్ లీగ్ లో ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ముందుకు రావాలని, ఆ మేరకు రాయితీలను ఇచ్చేందుకు కూడా సౌదీ ప్రభుత్వం సిద్ధమైనట్టు ‘ది ఏజ్’, ‘స్టేట్స్మెన్’ పత్రికలలో కథనాలు వచ్చాయి. ఫ్రాంచైజీలతో పాటు మ్యాచ్ అఫిషియల్స్, కోచ్లు, ఆటగాళ్లు, ఇతర సిబ్బందితో కూడా ఏడాది క్రితం నుంచే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఐపీఎల్ టీమ్స్ లో చాలామట్టుకు ప్రస్తుతం వివిధ దేశాల్లో జరుగుతున్న లీగ్ లలో ఫ్రాంచైజీలున్నాయి. దీంతో సౌదీలో కూడా వారితోనే టీ20 లీగ్ ను నిర్వహించేందుకు అక్కడి ప్రతినిధులు ప్రణాళికలు రచిస్తున్నారు.
అయితే ఇందుకు సంబంధించిన సమాచారం మాత్రం ఎక్కడా బయటకు రాకుండా సౌదీ ప్రతినిధులు జాగ్రత్త పడుతున్నారు. తమ దేశంలో క్రికెట్ ఆడితే భారీగా సొమ్ము ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారు. అయితే ఇది ఇంకా చర్చల దశలోనే ఉంది. ఏ దేశంలో అయినా క్రికెట్ ఫ్రాంచైజీ లీగ్ నిర్వహించాలంటే ఐసీసీ అనుమతి తప్పనిసరి. ఐసీసీతో సౌదీ ప్రతినిధులు కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తున్నది.
భారత క్రికెటర్లను ఆహ్వానించి..
ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా ఉన్న ఐపీఎల్ లో ఆడే భారత క్రికెటర్లకు ఇండియాలోనే గాక ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోని, హార్ధిక్ పాండ్యా, రిషభ్ పంత్ లు ముందువరుసలో ఉంటారు. అన్నీ కుదిరితే కోహ్లీ, రోహిత్, పాండ్యా, పంత్ లు సౌదీలో నిర్వహించబోయే లీగ్ లో ఆడే అవకాశముంది. అయితే ఈ విషయంలో బంతి బీసీసీఐ కోర్టులో ఉంటుంది. ఇండియన్ ప్లేయర్లను బయటి లీగ్ లలో ఆడేందుకు బీసీసీఐ అనుమతించదు.
కానీ బీసీసీఐతో సౌదీ ఇటీవల కాలంలో సత్సంబంధాలను కొనసాగిస్తోంది. ఐపీఎల్ లో గతేడాది సౌదీ దిగ్గజ పెట్రోలియం సంస్థ ‘ఆరామ్ కో’ స్పాన్సర్ గా వ్యవహరించింది. ఈ ఏడాది సౌదీ పర్యాటక శాఖ ఐపీఎల్ స్పాన్సర్షిప్ లో భాగమైంది. తమ లీగ్ లో భారత క్రికెటర్లను ఆడించే ఒప్పందం (?) తోనే ఈ స్పాన్సర్ షిప్ బంధాలు సాగుతున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి.

సౌదీలో క్రీడలకు పెద్దపీట..
ఒకప్పుడు కఠిన చట్టాలతో క్రీడల పేరెత్తితేనే అణిచివేసిన సౌదీ గత కొన్నాళ్లుగా క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నది. సహజ వాయువులైన ఇంధనాన్ని తన గర్భంలో దాచుకున్న ఆ దేశం.. దాని ద్వారా వచ్చిన సంపదను దేశ పర్యాటకం, క్రీడలు, ఇతర రంగాల మీద భారీగా ఖర్చు చేస్తున్నది. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే అగ్ర ఫుట్బాలర్ గా వెలుగొందుతున్న క్రిస్టియానో రొనాల్డోను అక్కడి అల్ నజర్ ఫుట్బాల్ క్లబ్ రెండేండ్ల ఒప్పందానికి భారీ మొత్తానికి దక్కించుకుంది. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లోని న్యూక్యాస్టిల్ యునైటైడ్ ను కొనుగోలు చేసింది. ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ ను నిర్వహిస్తున్నది. ఎఫ్ 1 రేసుల కోసం భారీగా ఖర్చు చేస్తున్నది. ప్రముఖ గోల్ఫర్ జార్జ్ నార్మన్ ఆధ్వర్యంలో గోల్ఫ్ మీద కూడా భారీగా వెచ్చిస్తుంది. ఇక క్రికెట్ కూడా దానికి తోడైతే సౌదీ అరేబియా రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ మక్కా ఖావడం ఖాయం..
