సారాంశం

India vs Bangladesh: 53 పరుగులు చేసి అవుటైన శుబ్‌మన్ గిల్... 132 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన భారత జట్టు..

 

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, హాఫ్ సెంచరీ తర్వాత అవుట్ అయ్యాడు. మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కోసం ప్రయత్నించిన శుబ్‌మన్ గిల్, బౌండరీ లైన్ దగ్గర మహ్మదుల్లా పట్టిన సూపర్ క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు..

132 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా. శుబ్‌మన్ గిల్‌కి ఇది వన్డేల్లో 10వ హాఫ్ సెంచరీ. అంతకుముందు 257 పరుగుల లక్ష్యఛేదనలో మెరుపు ఆరంభం అందించి, పెవిలియన్ చేరాడు రోహిత్ శర్మ..

మొదటి ఓవర్‌లో 2 ఫోర్లు బాదిన రోహిత్ శర్మ, ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో 4, 6 బాదాడు. ఓ ఎండ్‌లో రోహిత్ దూకుడుగా ఆడితే, సెటిల్ అవ్వడానికి సమయం తీసుకున్న శుబ్‌మన్ గిల్ కూడా బౌండరీలు బాదడం మొదలెట్టాడు. నసుమ్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు శుబ్‌మన్ గిల్..

ఈ ఏడాది ఇప్పటికే 61 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాకుండా ఛేజింగ్‌లో 750+ పరుగులు చేసిన రోహిత్, వన్డే వరల్డ్ కప్‌లో ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు..

ఏషియాలో 6 వేల వన్డే పరుగులు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి... హాఫ్ సెంచరీకి 2 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. హసన్ మహ్మద్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదిన రోహిత్ శర్మ, ఆ తర్వాతి బంతికి కూడా భారీ షాట్‌ ఆడి బౌండరీ లైన్ దగ్గర తోహిద్ హృదయ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..

విరాట్ కోహ్లీ వస్తూనే 2, 4, 6 బాదడంతో ఆ ఓవర్‌లో టీమిండియా ఖాతాలో 23 పరుగులు చేరాయి.  హసన్ మహ్మద్ వరుసగా రెండు నో బాల్స్ వేశాడు.