ICC Men's FTP: రాబోయే నాలుగేండ్లకు ఎఫ్టీపీ ప్రకటించిన ఐసీసీ.. ఆసీస్, ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లు
ICC Men's FTP: క్రికెట్ బోర్డులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ) ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసింది. గతంతో పోలిస్తే మ్యాచ్ ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
దేశానికో టీ20లీగ్లతో కిక్కిరిసిన క్రికెట్ షెడ్యూల్ తో ఊపిరాడకుండా ఉన్న క్రికెట్ బోర్డులకు ఐసీసీ కీలక పరీక్ష పెట్టింది. అంతర్జాతీయ క్రికెట్ కు రోజులు చెల్లుతున్నాయన్న అనుమానాలకు అడ్డుకట్ట వేస్తూ వచ్చే నాలుగేండ్ల కాలానికి క్రికెట్ షెడ్యూల్ ను ప్రకటించింది. 2023-27 కాలానికి గాను కొత్త ఎఫ్టీపీని గురువారం ప్రకటించింది. దీని ప్రకారం.. మొత్తం 12 జట్లు కలిపి 777 (మూడు ఫార్మాట్లు) మ్యాచ్ లు ఆడనున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న 2019-2023తో పోలిస్తే రాబోయే సైకిల్ లో 87 మ్యాచ్ లు పెరగడం గమనార్హం.
2023-2027 కాలానికి గాను అంతర్జాతీయ క్రికెట్ హోదా పొందిన 12 జట్లు.. 173 టెస్టులు, 281 వన్డేలు, 323 వన్డేలున్నాయి. మొత్తంగా 12 జట్లు 777 మ్యాచ్ లు ఆడతాయి. ఇక ప్రస్తుతం నడుస్తున్న సైకిల్ (2019-23) లో 151 టెస్టులు, 241 వన్డేలు, 301 టీ20లు ఆడుతున్నాయి. ఇవి మొత్తంగా 694 మ్యాచ్ లు.
రాబోయే సైకిల్లో ఇదే షెడ్యూల్ లోనే రెండు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్, ఒక వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు టీ20 ప్రపంచకప్లు జరుగనున్నాయి.
ఇక వచ్చే నాలుగేండ్లలో భారత్ ఆడే టెస్టుల సంఖ్య కూడా పెరుగనున్నది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తో భారత్.. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ లు ఆడనున్నది. ఆసీస్ తో 1992 తర్వాత ఐదు మ్యాచుల టెస్టులు ఆడటం ఇదే ప్రథమం. 2023-27 కాలానికి గాను భారత జట్టు 38 టెస్టులు ఆడనుంది. ఇందులో భాగంగా.. 2023-25 టెస్టు ఛాంపియన్షిప్ కు సంబంధించిన షెడ్యూల్ ప్రకారం.. స్వదేంలో భారత్.. న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్తో తలపడనుంది. అదే విధంగా విదేశాల్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఇక 2025-27లో స్వదేశంలో టీమిండియా.. ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో ఆడనుంది. విదేశాల్లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంకతో ఆడాల్సి ఉంది.