Ajinkya Rahane: 2020-21  బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టులో అవమానకర ఓటమి ఎదుర్కున్న  టీమిండియా.. తర్వాత మాత్రం పుంజుకుంది.  రెండో టెస్టులో నెగ్గడమే గాక సిరీస్ కూడా గెలుచుకుంది.

గతేడాది ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కష్టపడింది తానైతే క్రెడిట్ మాత్రం వేరేవాళ్లకు దక్కిందని సంచలన కామెంట్స్ చేశాడు టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే.. 2020-21 సీజన్ కు గాను ఈ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా లో జరిగిన సిరీస్ ను టీమిండియా.. 2-1 తేడాతో గెలుచుకున్నది. అడిలైడ్ లో జరిగిన తొలి టెస్టులో దారుణంగా విఫలమైనా.. తర్వాత పుంజుకుని చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నది. ఈ సిరీస్ లో విరాట్ కోహ్లి.. అడిలైడ్ టెస్టు ముగిశాక ఇండియాకు తిరిగి వచ్చాడు. 

తొలి టెస్టులో టీమిండియా దారుణ పరాజయం అనంతరం.. విరామం తీసుకుని (అనుష్క శర్మ డెలివరీ నేపథ్యంలో) భారత్ కు తిరిగివచ్చాడు. దీంతో మిగిలిన టెస్టులకు రహానే సారథ్యం వహించాడు. తొలి టెస్టులో దారుణ ఓటమిని దిగమింగిన భారత్.. మెల్బోర్న్ లో ముగిసిన రెండో టెస్టులో గెలిచింది. సిడ్నీలో జరిగిన మూడో టెస్టు డ్రా కాగా.. గబ్బాలో ముగిసిన నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించడమే గాక సిరీస్ ను కూడా గెలుచుకుని చరిత్ర సృష్టించింది. 

Scroll to load tweet…

ఇదిలాఉండగా.. తాజాగా ప్రముఖ క్రీడా జర్నలిస్టు బొరియా (బ్యాక్ స్టేజ్ విత్ బొరియా) కార్యక్రమంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గురించి రహానే మాట్లాడుతూ... ‘ఆస్ట్రేలియాలో నేనేం చేశానో నాకు తెలుసు. ఈ సిరీస్ లో భాగంగా డ్రెస్సింగ్ రూమ్ తో పాటు ఫీల్డ్ లో కూడా నేను కొన్ని సొంత నిర్ణయాలు తీసుకున్నాను. కానీ కొంత మంది ఆ నిర్ణయాలను తమవిగా చెప్పుకున్నారు.. నేను అలాంటి వ్యక్తిని కాను.. నాకు సిరీస్ గెలవడమే ముఖ్యం’ అని తెలిపాడు. కాగా రహానే పనైపోయిందని ఆరోపిస్తూ.. అతడి ఫామ్ పై వస్తున్న విమర్శలపై కూడా రహానే తనదైన శైలిలో స్పందించాడు. ‘ఆ వార్తలు చూసినప్పుడు నేను నవ్వుకుంటాను. క్రీడల గురించి తెలిసినవాళ్లెవరూ అలా మాట్లాడరు. రెడ్ బాల్ (టెస్టు క్రికెట్) నేను ఎలా ఆడానో తెలిసినవారెవరూ అలా చెప్పరు..’ అని అన్నాడు. 

కాగా.. బోర్డర్-గవాస్కర్ సిరీస్ ముగిశాక చాలా కార్యక్రమాలలో అప్పటి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో జట్టుగా తాము చేసిన పనులను గొప్పగా చెప్పుకున్నాడు. ఇందులో తనకు కొంచెం ఎక్కువ క్రెడిట్ ఇచ్చుకున్నాడు. మీడియా కూడా.. విరాట్ సారథ్యంలోని టీమిండియా ఆసీస్ ను ఓడించింది అని రాసింది కానీ.. మూడు టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించింది మాత్రం రహానే. మరి ఈ ఇద్దరిలో రహానే కష్టాన్ని తమ క్రెడిట్ గా మలుచుకున్నారనేది టీమిండియా అభిమానులను ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న.. 

Scroll to load tweet…

అడిలైడ్ టెస్టులో రెండో ఇన్నింగ్సులో 36 పరుగులకే ఆలౌట్ అయింది టీమిండియా. కానీ రెండో టెస్టులో మాత్రం పట్టుదలతో ఆడింది. తాత్కాలిక సారథిగా వ్యవహరించిన రహానే.. రెండో టెస్టులో రహానే సెంచరీ కూడా చేశాడు. మిగిలిన మూడు టెస్టులలో భారత్ అత్యద్భుతంగా పుంజుకుని సిరీస్ నెగ్గిందంటే అది జట్టు సమిష్టివిజయం.. రహానే కూడా ఎప్పుడూ అదే చెప్పేవాడు గానీ తనవల్లనే బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ నెగ్గామని ఎక్కడా చెప్పలేదు.