James Neesham Retirement: న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇక తాను బౌలింగ్ వేయలేనని, ఈ విభాగం నుంచి తాను రిటైర్ అవుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
ఐపీఎల్ లో పటిష్ట బౌలింగ్, బ్యాటింగ్ లైనప్ తో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కు భారీ షాక్. ఆ జట్టు ఆల్ రౌండర్, న్యూజిలాండ్ కు చెందిన జేమ్స్ నీషమ్ ఇక తాను బౌలింగ్ చేయబోనని, ఆ విభాగంంలో రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని తెలిపాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అదేంటి..? వేలంలో రూ. 1.5 కోట్లు పెట్టి కొన్న ఆటగాడు ఇంకా సీజన్ ప్రారంభంలోనే.. అదీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటిస్తే ఎలా..?
అక్కడే ఉంది అసలు కిటుకు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆటగాళ్లలో జేమ్స్ నీషమ్ ఒకడు. ఫన్నీ ట్వీట్స్ తో తన అభిమానులను ఆటపట్టించడంలో నీషమ్ ముందుంటాడు. గతంలో అతడి ట్వీట్స్ చూస్తే ఈ విషయం అర్థమవక మానదు. తాజాగా.. ఇన్ స్టా వేదికగా ఓ స్టోరీని షేర్ చేస్తూ నీషమ్ రాజస్థాన్ అభిమానులకు ఇలా ఫన్ ను పంచాడు.
అసలేం జరిగిందంటే..
అసలు విషయానికొస్తే ఈనెల 10న రాజస్థాన్ రాయల్స్.. లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడాల్సి ఉంది. వాంఖెడే వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ ప్రాక్టీస్ చేస్తున్నది. అయితే రాజస్థాన్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ బ్యాటింగ్ చేస్తుండగా.. నీషమ్ బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో నీషమ్ వేసిన బంతిని పరాగ్ బలంగా బాదాడు. అది కాస్తా వేగంగా దూసుకొచ్చి నీషమ్ తలకు తాకింది. దీంతో అతడు అక్కడికక్కడే కిందపడిపోయాడు.
ఈ నేపథ్యంలో నీషమ్.. తన ఇన్ స్టా స్టోరీలో ‘ఇక నేను నా బౌలింగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తా..’ అని ముందు ఒక నోట్ పెట్టాడు. ఆ తర్వాత రియల్ పరాగ్ కు బౌలింగ్ వేస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘పరాగ్ కు బౌలింగ్ వేయడం నుంచి...’ అని ఫన్నీగా రాసుకొచ్చాడు. ఈ పోస్టులు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇదిలాఉండగా.. లక్నోతో మ్యాచులో జేమ్స్ నీషమ్ ను ఆడించాలని రాజస్థాన్ భావిస్తున్నది. లోయారార్డర్ లో బ్యాటింగ్ ను బలపరిచేందుకు నీషమ్ కు అవకాశమివ్వాలని ఆ జట్టు అనుకుంటున్నది. రాజస్థాన్ ఇప్పటివరకు 3 మ్యాచులాడి రెండింటిలో గెలిచి ఒకదాంట్లో ఓడింది. అయితే ఈ 3 మ్యాచుల్లో నీషమ్ ఆడలేదు. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.
