మేమెక్కడున్నా మా హృదయం మీతోనే.. రిటైన్ కాని ఆటగాళ్ల భావోద్వేగం.. స్మృతులు గుర్తు చేసుకుంటున్న ఐపీఎల్ స్టార్లు
IPL Retention: ఐపీఎల్ రి‘టెన్షన్’ ముగిసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు తాము నిలుపుకోబోయే ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. అయితే సుదీర్ఘకాలం ఆయా జట్లతో నడిచిన ఆటగాళ్లు కొందరు.. ఈసారి వాటిని వీడుతున్నారు.
ఐపీఎల్ రి‘టెన్షన్’ ముగిసింది. 8 జట్లు తాము ఏ ఏ ఆటగాడిని రిటైన్ చేసుకుంటున్నాయో ప్రకటించాయి. మంగళవారం రాత్రి ముగిసిన ఈ ప్రక్రియలో.. 8 ఫ్రాంచైజీలు మొత్తం 27 మందిని అట్టిపెట్టుకుంటున్నట్టు ప్రకటించాయి. అయితే వీరిలో సుదీర్ఘకాలం ఆ ఫ్రాంచైజీ తరఫున ఆడి.. వచ్చే సీజన్ కోసం రిటైన్ కాక పలువురు కీలక ఆటగాళ్లు ఆ జట్లకు దూరమయ్యారు. మరికొందరు ఇతర కారణాలతో పాత ఫ్రాంచైజీలకు దూరం కానున్నారు. ఈ స్టార్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తమ గత స్మృతులను గుర్తు చేసుకున్నారు.
ముఖ్యంగా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున సుదీర్ఘకాలం ఆడిన రషీద్ ఖాన్, కెరీర్ ప్రారంభం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తో ఉన్న శ్రేయస్ అయ్యర్, నాలుగేండ్లుగా పంజాబ్ ను నడిపిస్తున్న కెఎల్ రాహుల్, తన స్వంత ఊళ్లో స్వంత టీమ్ లా భావించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ముందుగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున శ్రేయస్ అయ్యర్ తన ఇన్స్ట్రాగ్రామ్ లో స్పందిస్తూ .. తాను ఢిల్లీతో ప్రయాణం ప్రారంభించినప్పట్నుంచి.. మొన్నటి సీజన్ వరకు ఆటగాళ్లతో చేసిన ప్రయాణాన్ని గుర్తు చేస్తూ ఓ వీడియో పోస్టు చేశాడు. దానికి ‘ప్రియమైన ఢిల్లీ.. నీతో కలిసి నడిచినందుకు గర్వంగా ఉంది’ అంటూ లవ్ సింబల్ ను పోస్టులో రాసుకొచ్చాడు. ఈ పోస్టుకు పృథ్వీ షా, ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు మిగతా ఆటగాళ్లు కామెంట్ చేశారు. 2015 నుంచి అయ్యర్ ఢిల్లీతోనే ఉన్నాడు.
మరో ఢిల్లీ ఆటగాడు శిఖర్ ధావన్ కూడా ఓ వీడియోను పంచుకుంటూ.. ‘థ్యాంక్యూ ఢిల్లీ క్యాపిటల్స్.. ’ అని రాసుకొచ్చాడు. తన వీడియోకు ‘మణికె మాగె హితె..’ పాటను మిక్స్ చేశాడు ధావన్. దీనికి ఢిల్లీ క్యాపిటల్స్ స్పందిస్తూ.. ‘గబ్బర్ అంటే ఒక ఎమోషన్..’ అని కామెంట్ చేసింది.
ఇక పంజాబ్ మాజీ సారథి కెఎల్ రాహుల్.. పెవిలియన్ కు చేరుతున్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఇది అద్భుతమైన ప్రయాణం. మీ ప్రేమాభినాలకు కృతజ్ఞుడను. ఇతర జట్ల తరఫున మిమ్మల్ని కలుస్తాను..’అని రాసుకొచ్చాడు. 2017 నుంచి రాహుల్.. పంజాబ్ తరఫున ఆడుతున్నాడు.
రషీద్ ఖాన్ స్పందిస్తూ.. ‘సన్ రైజర్స్ హైదరాబాద్ తో గొప్ప ప్రయాణం. ఇన్నాళ్లు నన్ను ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు. ఇక ఆరెంజ్ ఆర్మీ నా బలం. మీలాంటి అభిమానులు దొరికినందుకు నేను అదృష్టవంతుడిని..’ అని పోస్టు చేశాడు. రషీద్ కూడా 2017 నుంచి సన్ రైజర్స్ కు ఆడుతున్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఆర్సీబీ యాజమాన్యం ట్విట్టర్ లో పెట్టిన ఓ ట్వీట్ కు స్పందిస్తూ.. ‘థ్యాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ ఆర్సీబీ..’ అని కామెంట్ చేశాడు. 2018 ఐపీఎల్ వేలంలో చాహల్ ను ఆర్సీబీ దక్కించుకుంది.
వీళ్లే గాక చెన్నై సూపర్ కింగ్స్ తో సుదీర్ఘకాలంతా ప్రయాణం సాగిస్తున్న ఫాఫ్ డూప్లెసిస్, డ్వేన్ బ్రావో లు కూడా వారి సామాజిక మాధ్యమాలలో సీఎస్కే రిటైన్డ్ లిస్ట్ లో నిలిచిన ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటు ఆయా జట్ల తరఫున చాలాకాలంగా ఆడుతున్న ఆటగాళ్లు.. ఇక తమ పాత ఫ్రాంచైజీ తమను తీసుకోదని తెలిసిన ఆటగాళ్లంతా సామాజిక మాధ్యమాల వేదికగా ఆ జట్టు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి వీల్లంతా ఐపీఎల్ వేలంలో అయినా ఆయా జట్లకు దక్కుతారా..? లేదంటే మిగతా జట్లకు వెళ్తారా..? అనేది తెలియాలంటే ఐపీఎల్ మెగావేలం దాకా వేచి చూడాల్సిందే.