Most Expensive Players In Every IPL: ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008) నుంచి 2021 దాకా జరిగిన వేలం ప్రక్రియలలో పలు ఫ్రాంచైజీలు ప్రతి ఏటా అత్యధిక ధర వెచ్చించి ఆటగాళ్లను తీసుకున్నాయి..
ఐపీఎల్ ఇక ఎంతమాత్రమూ భారత్ కే పరిమితమైనది కాదు. క్యాష్ రిచ్ లీగ్ గా గుర్తింపు పొందిన ఐపీఎల్ లో గతేడాది రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం బిడ్ లను ఆహ్వానించగా.. లక్నో, అహ్మదాబాద్ కోసం బడా కార్పొరేట్లు సైతం ఎగబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఫుట్బాల్ క్లబ్ (మాంచెస్టర్ యూనైటైడ్) తో పాటు అదానీ వంటి బడా వ్యాపారవేత్తలు సైతం ఫ్రాంచైజీల కోసం పోటీ పడ్డాయంటే దాని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఇక ఫ్రాంచైజీల కోసం వేల కోట్లు (లక్నోకు రూ. 7,090 కోట్లు, అహ్మదాబాద్ కు రూ. 5,625 కోట్లు) ఖర్చు పెడుతున్న ఫ్రాంచైజీలు.. వేలంలో ఆటగాళ్లను దక్కించుకోవడానికి కూడా భారీగానే ఖర్చు పెడుతున్నాయి.
ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008) నుంచి 2021 దాకా జరిగిన వేలం ప్రక్రియలలో ఏ ఏ జట్టు ఏ ఆటగాడిని ఎంత ధర పెట్టి దక్కించుకున్నాయో ఇక్కడ చూద్దాం.
2008.. సీఎస్కే ధోని : తొలి ఐపీఎల్ సీజన్ లో ధోనిని 1.5 మిలియన్ యూఎస్ డాలర్లు (సుమారు రూ. 6 కోట్లు) పెట్టి దక్కించుకుంది చెన్నై సూపర్ కింగ్స్..
2009.. ఆండ్రూ ఫ్లింటాఫ్ (సీఎస్కే), కీరన్ పొలార్డ్ (ఆర్సీబీ) : రెండో సీజన్ లో ఇద్దరు ఆటగాళ్లు అత్యధిక ధర దక్కించుకున్నారు. ఒక్కొక్కరు 1.55 మిలియన్ యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 7.55 కోట్లు) దక్కింది.
2010.. షేన్ బాండ్ (కేకేఆర్), కీరన్ పొలార్డ్ (ముంబై) : మూడో సీజన్ లో కూడా విండీస్ ఆల్ రౌండర్ పొలార్డ్ అత్యధిక ధర దక్కించుకున్నాడు. వేలంలో అతడికి రూ. 3.4 కోట్లు దక్కాయి. పొలార్డ్ తో పాటు కోల్కతా నైట్ రైడర్స్.. న్యూజిలాండ్ ఆటగాడు షేన్ బాండ్ కు కూడా అదే (రూ. 3.4 కోట్లు) ఇచ్చి దక్కించుకుంది.
2011.. గౌతం గంభీర్ (కేకేఆర్) : 2011 ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ జట్టు గంభీర్ ను రూ. 11.04 కోట్లకు కొనుగోలు చేసింది.
2012.. రవీంద్ర జడేజా (సీఎస్కే) : టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కు ఈ సీజన్ లో రూ. 9.72 కోట్లు దక్కాయి.
2013.. గ్లెన్ మ్యాక్స్వెల్ (ముంబై) : ఈ సీజన్ లో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ కు అత్యధిక ధర దక్కింది. ముంబై జట్టు అతడిని రూ. 5.3 కోట్లు పెట్టి కొనుక్కుంది.
2014.. యువరాజ్ సింగ్ (ఆర్సీబీ) : రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యువీని రూ. 14 కోట్లు పెట్టి దక్కించుకుంది. ఈ సీజన్ వరకు ఐపీఎల్ లో ఇదే అత్యధిక ధర..
2015.. యువరాజ్ సింగ్ (ఢిల్లీ) : ఈ సీజన్ లో కూడా యువరాజ్ సింగ్ అత్యధిక ధర దక్కించుకున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు యువీని రూ. 16 కోట్లు పెట్టి దక్కించుకుంది.
2016.. షేన్ వాట్సన్ (ఆర్సీబీ) : ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఈ సీజన్ లో రూ. 9.5 కోట్లతో హయ్యస్ట్ పేయిడ్ ప్లేయర్ గా ఉన్నాడు.
2017, 2018.. బెన్ స్టోక్స్ (పూణె, రాజస్థాన్) : ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను 2017లో పూణె రూ. 14.50 కోట్లకు దక్కించుకుంది. ఆ తర్వాత సీజన్ లో కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టు స్టోక్స్ ను రూ. 12.50 కోట్లతో కొనుక్కుంది.
2019.. జయదేవ్ ఉనద్కత్ (రాజస్థాన్), వరుణ్ చక్రవర్తి (కింగ్స్ లెవెన్ పంజాబ్) : 2019 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జయదేవ్ ఉనద్కత్ ను రూ. 8.4 కోట్లకు దక్కించుకుంది. వరుణ్ చక్రవర్తిని పంజాబ్ జట్టు.. కూడా అదే ధరతో కొనుగోలు చేసింది.
2020.. పాట్ కమిన్స్ (కేకేఆర్) : ఆస్ట్రేలియా టెస్టు సారథి పాట్ కమిన్స్ ను కోల్కతా జట్టు రూ. 15.50 కోట్లతో తీసుకుంది. ఐపీఎల్ లో యువరాజ్ సింగ్ తర్వాత అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు.
2021.. క్రిస్ మోరిస్ (రాజస్థాన్) : గత సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ ను రూ. 16.5 కోట్లతో దక్కించుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్ లో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడు క్రిస్ మోరిస్ మాత్రమే..
2022 లో ఎవరు..? : ఈ ఐపీఎల్ లో భారత ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లతో పాటు డేవిడ్ వార్నర్ లు జాబితాలో ఉన్నారు. అయితే శనివారం, ఆదివారాలలో జరుగబోయే వేలంలో ఎవరు అత్యధిక ధర దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
