పరుగుల యంత్రం, భారత జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ టీమిండియా తరఫున మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ గా ఉన్నా సారథిగా అతడి ఖాతాలో ఐసీసీ ట్రోఫీ లేదనే  వెలతి ఎప్పటికీ తీరనిది. 

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఇటీవల ఆర్సీబీ పాడ్‌కాస్ట్ లో మాట్లాడుతూ.. తనను అందరూ ఓ విఫల కెప్టెన్ లా చూశారని, పలు టోర్నీలలో ఫైనల్ కు చేరినా ఎవరూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు కూడా విరాట్ కు మద్దతుగా నిలిచారు. ఐసీసీ ట్రోఫీలు గెలవలేదన్న కారణంతో కోహ్లీ విజయాలను తక్కువ చేసి చూడటం సరికాదని అంటున్నారు. తాజాగా ఈ చర్చపై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ స్పందించాడు. 

ఆర్సీబీ పాడ్‌కాస్ట్ లో కోహ్లీ మాట్లాడుతూ.. ‘ఎవరైనా టోర్నమెంట్ లు ఆడేది గెలవడం కోసమే. కానీ దురదృష్టవశాత్తూ మేం పలు టోర్నీలలో విజయాలు సాధించలేకపోయాం. దాంతో నన్ను అంతా ఓ విఫల కెప్టెన్ గా చూశారు..’అని కోహ్లీ చెప్పిన వ్యాఖ్యానించిన విషయం విదితమే. 

తాజాగా పనేసర్ తన ట్విటర్ ఖాతా వేదికగా స్పందిస్తూ.. ‘దురదృష్టవశాత్తూ భారత జట్టుకు సారథిగా ఉంటే ఎదుర్కునే ఒత్తిడి ఇది. ఎవరు కూడా నెంబర్ 2, 3 టీమ్ లను గుర్తుంచుకోరు. ఐసీసీ టోర్నీలలో అందరూ నెంబర్ వన్ టీమ్ నే గుర్తుంచుకుంటారు..’అని పేర్కొన్నాడు. 

Scroll to load tweet…

కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరింది. 2019 వన్డే వరల్డ్ కప్ లో సెమీస్ చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో పాకిస్తాన్ చేతిలో ఓడగా వరల్డ్ కప్ సెమీస్ లో న్యూజిలాండ్ భారత్ కు షాకిచ్చింది. ఇక 2021 లో ఐసీసీ తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ భారత్ ఫైనల్ చేరింది. ఇక్కడ కూడా భారత్.. న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ఇదే ఏడాది దుబాయ్ లో ముగిసిన టీ20 ప్రపంచకప్ లో కూడా భారత్ లీగ్ దశలోనే వెనుదిరిగింది. అయితే ఐసీసీ ట్రోఫీలను సాధించకపోయినా కోహ్లీ.. ఐదేండ్ల పాటు టెస్టులలో భారత్ ను నెంబర్ వన్ గా నిలిపాడు. ఆస్ట్రేలియా గడ్డపై రెండుసార్లు అతడి సారథ్యంలోనే భారత జట్టు బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ దక్కించుకుంది. ద్వైపాక్షిక సిరీస్ లలో భారత్ ను విజయపథంలో నడపడంలో కోహ్లీ విజయవంతమయ్యాడు.