Asianet News TeluguAsianet News Telugu

క్రికెట్లో త్వరలో కరోనా సబ్‌స్టిట్యూట్...

కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టగానే ఆటను పునఃప్రారంభించాలనే యోచనలో ఉన్నాయి అన్ని క్రికెట్ బోర్డులు. ఇప్పటికే పేస్‌ బౌలర్ల భీకర దాడిలో గాయపడిన బ్యాట్స్‌మెన్‌ కోసం ఇటీవల కంకషన్‌ (తల అదరటం) సబ్‌స్టిట్యూట్‌ నిబంధన తీసుకొచ్చిన ఐసీసీకి.. ఇప్పుడు కరోనా వైరస్‌ కారణంగా మరో నిబంధన జోడించాల్సిన అవసరం ఏర్పడింది. 

Cricket Board Requests For A Corona Substitute In The Wake Of COVID-19
Author
Hyderabad, First Published May 31, 2020, 6:21 AM IST

కరోనా వైరస్ ఇప్పటికే మన జీవితాల్లో అనేక మార్పులను తీసుకొచ్చింది. మాస్కులు, ఫిజికల్ డిస్టెంసింగ్ అనేవి మన జీవితంలో భాగం అయిపోయాయి. కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలతోపాటుగా క్రీడా రంగం కూడా పడకేసింది. 

కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టగానే ఆటను పునఃప్రారంభించాలనే యోచనలో ఉన్నాయి అన్ని క్రికెట్ బోర్డులు. ఇప్పటికే పేస్‌ బౌలర్ల భీకర దాడిలో గాయపడిన బ్యాట్స్‌మెన్‌ కోసం ఇటీవల కంకషన్‌ (తల అదరటం) సబ్‌స్టిట్యూట్‌ నిబంధన తీసుకొచ్చిన ఐసీసీకి.. ఇప్పుడు కరోనా వైరస్‌ కారణంగా మరో నిబంధన జోడించాల్సిన అవసరం ఏర్పడింది. 

బయో సెక్యురిటీ, సహా ఇతర ముందు జాగ్రత్తలు తీసుకుని టెస్టు మ్యాచులు నిర్వహిస్తున్నా.. మ్యాచ్‌ మధ్యలో ఓ ఆటగాడికి కోవిడ్‌-19 సోకితే ఏమిటనే ప్రశ్నకు ఐసీసీ సమాధానం కనుగొనాల్సి ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం కోవిడ్‌ బాధితుడితో సన్నిహితంగా ఉన్నవారందరూ క్వారంటైన్‌లో ఉండాలి. 

టెస్టు మ్యాచ్‌ మధ్యలో క్రికెటర్‌కు కరోనా సోకితే రెండు జట్ల క్రికెటర్లు సహా మ్యాచ్‌ అధికారులూ క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుందనే హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి. జులైలో వెస్టిండీస్‌తో స్వదేశంలో మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధం చేసుకున్న ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఇప్పుడు ఐసీసీ వద్దకు వచ్చింది. 

కరోనా వైరస్‌ తీసుకొచ్చిన ముప్పుతో ఇప్పుడు టెస్టు మ్యాచుల్లో కరోనా సబ్‌స్టిట్యూట్‌ అవకాశం కల్పించాలని కోరింది. దీనిపై ఐసీసీ, క్రికెట్‌ కమిటీ ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.

ఇకపోతే.... క్రికెట్‌ సీజన్‌ పున ప్రారంభానికి రంగం సిద్ధం అవుతున్న తరుణంలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) క్రికెట్‌ కమిటీ ఉమ్మి వాడకంపై నిషేధం విధించింది. అనిల్‌ కుంబ్లే సారథ్యంలోని ఐసీసీ క్రికెట్‌ కమిటీ వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశమైంది. కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో ఉమ్మి వాడకాన్ని నిషేధిస్తున్నట్టు కుంబ్లే కమిటీ ప్రకటించింది. 

ఐసీసీ క్రికెట్‌ కమిటీ నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఉమ్మి వాడకంపై నిషేధం విధించినా.. చెమట (స్వేదం) వాడేందుకు ఐసీసీ అనుమతించింది. ఇక నుంచి బంతిపై మెరుపు నిలిపేందుకు ఉమ్మిని కాకుండా చెమటను ఉపయోగించాలని ఐసీసీ నిర్దేశించింది. 

ఈ గండం గట్టెక్కెందుకు బాల్‌ టాంపరింగ్‌కు చట్టబద్దత కల్పించాలనే డిమాండ్‌ ఆరంభంలో ఎక్కువగా వినిపించింది. ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఎజెండాలో ఆ అంశం ఉన్నదనే వార్తలు సైతం వినిపించాయి. కానీ అనిల్‌ కుంబ్లే కమిటీ బాల్‌ టాంపరింగ్‌కు చట్టబద్దతపై చర్చించలేదని సమాచారం. అందుకే ఉమ్మి వాడకంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

క్రికెట్‌ జట్టుగా ఆడే ఆట. వికెట్‌ పడినప్పుడు మైదానంలో ఆటగాళ్లు భౌతిక దూరం పాటిస్తూ సంబురాలు చేసుకోవచ్చు. సెంచరీ చేసినప్పుడు సహచరుడిని ఆలింగం చేసుకోకుండా అభినందనించవచ్చు. కానీ మ్యాచ్‌పై పట్టు నిలిపేందుకు దోహదం చేసే బంతిపై మెరుపు కొనసాగించేందుకు ఉమ్మి ప్రయోగం అనివార్యం. 

ఉమ్మితో బంతిపై మెరుపును మరికొన్ని ఓవర్ల పాటు నిలుపుదల చేయకపోతే 10-15 ఓవర్ల తర్వాత నుంచే బ్యాట్స్‌మెన్‌ పెత్తనానికి తెరలేస్తుంది. బౌలర్లకు పోషించేందుకు క్రీయాశీలక పాత్ర ఉండబోదు!. 

Follow Us:
Download App:
  • android
  • ios