ఆర్సీబీకి బిగ్ షాక్.. హర్షల్ పటేల్ ఇంట తీవ్ర విషాదం.. సోదరి మృతి..? బబుల్ ను వీడి ఇంటికి పయనం
Harshal Patel: ఐపీఎల్-2022 సీజన్ లో వరుసగా మూడు విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు బిగ్ షాక్. ఆ జట్టు ప్రధాన బౌలర్ హర్షల్ పటేల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దీంతో అతడు బబుల్ ను వీడాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ హర్షల్ పటేల్ ఇంట తీవ్ర విషాదం. అతడి కుటుంబంలో ఓ వ్యక్తి మరణించడంతో అతడు ఆర్సీబీ బస చేస్తున్న హోటల్ ను వీడాడు. శనివారం ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ అనంతరం అతడికి ఈ విషయం తెలిసింది. దీంతో హుటాహుటిన హర్షల్.. గుజరాత్ బయల్దేరాడు. హర్షల్ పటేల్ సొంత రాష్ట్రం గుజరాత్. విషయం తెలియగానే అతడు పూణే నుంచి నేరుగా గుజరాత్ వెళ్లినట్టు ఆర్సీబీ వర్గాలు తెలిపాయి.
అయితే గత కొన్నాళ్లుగా హర్షల్ పటేల్ సోదరి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉందని, మరణించింది ఆమె అని ట్విట్టర్ లో పలువురు ట్వీట్ చేశారు. కానీ ఈ విషయమై ఆర్సీబీ యాజమాన్యం గానీ, హర్షల్ కుటుంబసభ్యులు గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
సోదరి మరణవార్త..? తెలియగానే పూణే నుంచి ప్రత్యేక పర్మిషన్ తీసుకుని గుజరాత్ వెళ్లిన హర్షల్.. మళ్లీ ఈనెల 12న చెన్నై సూపర్ కింగ్స్ తో ఆ జట్టు ఆడబోయే తదుపరి మ్యాచులో కలుస్తాడని ఆర్సీబీ వర్గాలు తెలిపాయి. ఇదే విషయమై ఆర్సీబీ ఓ ప్రకటనలో స్పందిస్తూ.. ‘దురదృష్టవశాత్తు హర్షల్ పటేల్ కుటుంబసభ్యులలో ఒకరు మరణించడం వల్ల అతడు బబుల్ ను వీడుతున్నాడు. అయితే ఏప్రిల్ 12 నాటి చెన్నై తో గేమ్ లో అతడు తిరిగి జట్టుతో చేరతాడు...’ అని పేర్కొంది.
గతేడాది ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్ల (32) తో పర్పుల్ క్యాప్ దక్కించుకున్న హర్షల్ పటేల్.. ఇప్పటివరకు ఈ సీజన్ లో నాలుగు మ్యాచులాడి 6 వికెట్లు తీశాడు. మిడిల్ ఓవర్స్ తో పాటు డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేయడంలో దిట్ట అయిన హర్షల్.. శనివారం ముంబై తో జరిగిన మ్యాచులో నాలుగు ఓవర్లు వేసి 23 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. రోహిత్ శర్మ కూడా హర్షల్ బౌలింగ్ లోనే ఔటయ్యాడు.