India vs West Indies ODI: మ్యాచులు జరుగుతున్నప్పుడు అగ్రెసివ్ గా ఉండటంలో కోహ్లితో పోల్చితే రోహిత్ స్టైలే వేరు. కూల్ అండ్ కామ్ గా గేమ్ ను నడిపించడంలో రోహిత్ సమర్థుడు. కానీ నిన్నటి మ్యాచులో...
ఫీల్డ్ లో కూల్ అండ్ కామ్ గా కనిపించడంలో టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని ఫాలో అవుతాడు భారత కొత్త సారథి రోహిత్ శర్మ. విరాట్ కోహ్లిలా ఫీల్డ్ లో అగ్రెసివ్ గా ఉండకున్నా.. పని కానిస్తాడు రోహిత్. అయితే బుధవారం వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో మాత్రం సహనం కోల్పోయాడు. ఎనిమిది వికెట్లు పడి మ్యాచ్ చేతికొస్తుందనుకున్న తరుణంలో విండీస్ ఆటగాడు ఓడెన్ స్మిత్ విసిగిస్తుండటంతో హిట్ మ్యాన్.. తన ఫీల్డర్లపై కాస్త అసహనానికి లోనయ్యాడు. ఫీల్డింగ్ లో అలసత్వం ప్రదర్శిస్తున్న యుజ్వేంద్ర చాహల్ పై అసహనం ప్రదర్శించాడు.
ఇన్నింగ్స్ 45 వ ఓవర్లో.. వాషింగ్టన్ సుందర్ కు బంతిని అందించాడు రోహిత్. అప్పటికే 8 వికెట్లు కోల్పోయిన విండీస్ తోకను త్వరగా కత్తిరిద్దామనకుంటే ఓడెన్ స్మిత్ (24) మాత్రం భారత విజయాన్ని ఆలస్యం చేస్తూ విండీస్ కు ఆశలు కల్పిస్తున్నాడు. అయితే అతడిని ఔట్ చేయడానికి హిట్ మ్యాన్ వ్యూహం పన్నాడు.
ఈ క్రమంలో చాహల్ ను లాంగాఫ్ వద్దకు వెళ్లమని హిట్ మ్యాన్ ఆదేశించాడు. చాహల్ అది పట్టించుకోకుండా.. మెల్లగా పెళ్లి నడక నడుస్తున్నాడు. దీంతో సహనం కోల్పోయిన హిట్ మ్యాన్.. ‘ఏమైంది నీకు..ఎందుకు సరిగా పరిగెట్టడం లేదు. నడువ్.. తొందరగా ఫీల్డ్ (లాంగాఫ్) కు పరిగెత్తు..’ అని చాహల్ పై అరిచాడు. దీంతో భయపడిన చాహల్.. పరుగు లంకించుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ పేలుతున్నాయి.
ఈ మధ్య కాలంలో అలాంటి స్పెల్ చూడలేదు : ప్రసిద్ధ్ పై హిట్ మ్యాన్ ప్రశంసలు
బుధవారం నాటి మ్యాచులో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో టీమిండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ సంచలన స్పెల్ వేశాడు. ప్రసిద్ధ్.. 9 ఓవర్లు వేసి 12 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 3 మెయిడిన్లు కూడా ఉండటం గమనార్హం. కాగా.. మ్యాచ్ అనంతరం ప్రసిద్ధ్ ప్రదర్శనపై హిట్ మ్యాన్ ప్రశంసలు కురిపించాడు. ఈ మధ్యకాలంలో.. ముఖ్యంగా వన్డేలలో ఇలాంటి గొప్ప ప్రదర్శన చూడలేదని అన్నాడు. ప్రసిద్ధ్ బౌలింగ్ లో మంచి పేస్ తో పాటు లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసురుతున్నాడని కొనియాడాడు. అతడు ఇటువంటి ప్రదర్శనలు మరిన్ని చేయాలని హిట్ మ్యాన్ ఆశించాడు.
ఇక బుధవారం నాటి మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (64), కెఎల్ రాహుల్ (49) రాణించారు. స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్.. 46 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇండియా 44 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను కూడా గెలుచుకుంది.
