IPL Auction 2022: క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలానికి మరో పది రోజులే బాకీ ఉంది. బెంగళూరు వేదికగా జరిగే ఈ మెగా కార్యక్రమానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఈనెల 12, 13 తేదీలలో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల (590 మంది) జాబితాను కూడా బీసీసీఐ ఖరారు చేసింది. సోమవారం ఇందుకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించింది.దీంతో ఫ్రాంచైజీలన్నీ వేలానికి బయల్దేరడానికి తుది ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఏ ఆటగాడిని తీసుకోవాలి..? ఏ క్రికెటర్ కు ఎంత దాకా ఖర్చు పెట్టొచ్చు..? తదితర అంశాల మీద దృష్టి సారించాయి.
ఈ నేపథ్యంలో బీసీసీఐ.. వేలంలో పాల్గొనబోయే ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వేలానికి రాబోయే 10 ఫ్రాంచైజీల ప్రతినిధులు.. ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.
అవేంటంటే..
1. ఐపీఎల్ 2022 వేలం బయో బబుల్ లో జరుగుతుంది. కరోనా నేపథ్యంలో ఫ్రాంచైజీల ప్రతినిధులంతా బబుల్ నిబంధనలను పాటించాలి.
2. వేలానికి వచ్చే ప్రతినిధులంతా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి. బీసీసీఐ వైద్య అధికారులు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ టెస్టులలో నెగిటివ్ వస్తేనే వేలానికి అనుమతి ఉంది.
3. ఈసారి వేలంలో రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ లేదు. ఆర్టీఎం అంటే.. గతంలో ఒక జట్టు తరఫున ఆడిన ఆటగాడు వేలంలోకి వెళ్లినప్పుడు అతడిని పలు జట్లు ఒక మొత్తానికి దక్కించుకుంటాయి. అయితే ఆ సందర్భంలో సదరు ఆటగాడి పాత జట్టే అతడిని వేలంలో అత్యధిక ధర పాడుకున్న జట్టుకు సమానమైన ధర చెల్లించి తిరిగి అతడిని దక్కించుకోవచ్చు. ఈసారి ఈ ఆప్షన్ లేదు.
4. ఈ వేలంలో ఆటగాళ్ల కోసం ఖర్చు పెట్టే మొత్తం రూ. 90 కోట్లకు మించడానికి వీళ్లేదు. గత సీజన్ లో ఇది రూ. 80 కోట్లుగా ఉండేది.
5. గత 15 రోజులలో విదేశాల నుంచి భారత్ కు వచ్చిన ప్రతినిధులు ఏడు రోజుల పాటు క్వారంటైన్ లో గడపాలి. వాళ్లు 8, 9 వ తేదీలలో బీసీసీఐ నిర్వహించే కరోనా నిర్ధారణ పరీక్షలో నెగిటివ్ గా తేలాలి.
6. ఫిబ్రవరి 11న టీమ్ హోటల్ కు వచ్చే ప్రతినిధుల మీద బీసీసీఐ కన్నేసి ఉంచింది. కొవిడ్ లక్షణాలు ఉన్నవారిపై నిశితమైన నిఘా ఉంది.
7. అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 7 గంటల దాకా కరోనా పరీక్షలను నిర్వహిస్తారు. వేలానికి ఏ ఆటంకం కలగకుండా ఉండేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
8. కరోనా నెగిటివ్ రిపోర్డులు ఉండి, లక్షణాలేమీ లేని ప్రతినిధులు మాత్రమే ప్రధాన వేదిక వద్దకు అనుమతించబడతారు.
9. వేలానికి వచ్చే ప్రతినిధులంతా వారి కరోనా వ్యాక్సినేషన్ వివరాలను బీసీసీఐ అధికారులకు వెల్లడించాలి.
10. ఆడిటోరియంలో ప్రతినిధులంతా మాస్కులు ధరించాలి.
