స్మిత్ దెబ్బకు విలియమ్సన్ ఔట్...ఇక మిగిలింది కోహ్లీనే
యాషెస్ సీరిస్ లో వరుస సెంచరీలతో అదరగొడుతున్న ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ మరో మైలురాయిని అందుకున్నాడు.తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాకింగ్స్ లో అతడు రెండు స్ధానానికి ఎగబాకాడు.
యాషెస్ సీరిస్ లో అదరగొడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ మరో మైలురాయిని అందుకున్నాడు. ఏడాది నిషేదం తర్వాత ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో అతడు వరుస సెంచరీలతో అదరగొట్టడమే కాదు రెండో టెస్ట్ లో 92 పరుగులతో రాణించాడు. ఇలా కేవలం మూడు ఇన్నింగ్సుల్లోనే ఏకంగా 378 పరుగులు బాదిన స్మిత్ టెస్ట్ ర్యాకింగ్స్ లో దూసుకుపోతున్నాడు.
తాజాగా ఐసిసి ప్రకటించిన టెస్ట్ ర్యాకింగ్స్ లో స్మిత్ 913 పాయింట్లతో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. గతకొంతకాలంగా ఈ స్థానంలో కొనసాగుతున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 887 పాయింట్లతో మూడో స్ధానానికి పడిపోయాడు. అయితే ఈ టెస్ట్ ర్యాకింగ్స్ లో టాప్ లో నిలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(922 పాయింట్లు) కంటే స్మిత్ కేవలం 9 పాయింట్లు మాత్రమే వెనుకబడివున్నాడు.
అయితే ఇప్పటికే గాయం కారణంగా స్మిత్ రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ కు దూరమయ్యాడు. అతడు గాయంనుండి కోలుకోకుంటే మూడో టెస్ట్ కు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ నెల 22వ తేదీ నుండి భారత్-విండీస్ ల మధ్య రెండు టెస్ట్ మ్యాచుల సీరిస్ జరగనుంది. ఇందులో కోహ్లీ రాణిస్తే అతడి టాప్ ర్యాంకుకు వచ్చిన ప్రమాదమేమీ లేదు. ఒకవేళ ఈ సీరిస్ లో కోహ్లీ విఫలమై... గాయం నుండి కోలుకుని స్మిత్ మిగతా మ్యాచుల్లో రాణిస్తే మాత్రం ర్యాంకులు తారుమారయ్యే అవకాశాలున్నాయి.
ఇక ఐసిసి ప్రకటించిన టెస్ట్ ర్యాకింగ్స్ లో కోహ్లీ తర్వాత చటేశ్వర్ పుజారా ఒక్కడే టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. పుజారా 881 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. బౌలర్లలో ఆస్ట్రేలియా ఆటగాడు కమిన్స్ 914 పాయింట్లతో మొదటి స్ధానంలో నిలచాడు. టీమిండియా స్పిన్ బౌలర్లు రవీంద్ర జడేజా 794, రవిచంద్రన్ అశ్విన్ 763 పాయంట్లతో టాప్ టెన్ టెస్ట్ బౌలర్ల జాబితాలో నిలిచారు. అలాగే వీరిద్దరు ఆల్ రౌండర్ల జాబితాలో కూడా వరుసగా 3, 7 స్ధానాల్లో నిలిచారు. ఇక టెస్ట్ జట్ల ర్యాకింగ్ విషయానికి వస్తే భారత్ 113 పాయింట్లతో మొదటిస్థానంలో,న్యూజిలాండ్ 111 పాయింట్లతో రెండో స్ధానంలో నిలిచాయి.