సీనియర్లకు కోత.. జూనియర్లకు మోత.. బీసీసీఐ కొత్త కాంట్రాక్టులివే..!
BCCI Central Contracts: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అపెక్స్ బోర్డ్ సమావేశం ఈనెల 21న జరుగనుంది. ఈ సమావేశంలో బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోనున్నది. ఆటగాళ్ల కాంట్రాక్టులకు సంబంధించి కూడా ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి.
చాలాకాలంగా టెస్టులకే పరిమితమై వయసు భారం, ఫామ్ లేమి కారణంగా ఇప్పుడు ఈ ఫార్మాట్ లో కూడా కనిపించడం మానేసిన టెస్టు వెటరన్స్ పై బీసీసీఐ వేటు వేయనుంది. గత దశాబ్దకాలంలో భారత జట్టు కీలక విజయాల్లో కీలక పాత్ర పోషించిన వెటరన్ ఆటగాళ్లు అజింక్యా రహానే తో పాటు పేసర్ ఇషాంత్ శర్మ, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాల కాంట్రాక్టులను తొలగించనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే వీరి కెరీర్ లకు అనధికారికంగా ఎండ్ కార్డ్ లు వేసిన బీసీసీఐ.. త్వరలోనే సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి కూడా తప్పించనున్నట్టు సమాచారం.
బీసీసీఐ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు రహానే, ఇషాంత్ శర్మ, సాహా లకు సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తప్పించనున్న బోర్డు.. టీ20లలో రఫ్ఫాడిస్తున్న సూర్యకుమార్ యాదవ్, వన్డేలలో నిలకడగా ఆడుతున్న శుభమన్ గిల్, భావి సారథి హార్ధిక్ పాండ్యాలకు ప్రమోషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది.
2022 -23 సీజన్ కు గాను ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టు విషయమై బీసీసీఐ చర్చించనున్నది. ఈనెల 21న జరగాల్సి ఉన్న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీని గురించి చర్చించనున్నారు. టీ20 ప్రపంచకప్ లో భారత్ ఓటమిపై సమీక్ష, స్ప్లిట్ కెప్టెన్సీ, స్ప్లిట్ కోచింగ్, హార్ధిక్ పాండ్యాకు టీ20 పగ్గాలు అప్పజెప్పడం, సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక గురించి ప్రధానంగా చర్చ జరుగనున్నది. ఇదే మీటింగ్ లో సెంట్రల్ కాంట్రాక్టుల మీదా చర్చించనున్నారు.
ప్రస్తుతం రహానే, ఇషాంత్ శర్మ లు గ్రేడ్ - బీలో ఉండగా వృద్ధిమాన్ సాహా గ్రేడ్ - సీలో ఉన్నాడు. ఈ ముగ్గురూ కాంట్రాక్టులు కోల్పోతే ఇక తర్వాత జట్టులో చోటు కూడా కష్టమే.
ఇక సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ లు ప్రస్తుతం గ్రేడ్ - సీలో ఉండగా వీరికి ప్రమోషన్ దక్కనుంది. హార్ధిక్ పాండ్యా కూడా గ్రేడ్-సీలోనే ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్నాక పాండ్యా అద్భుత ఆటతో మెప్పిస్తున్నాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు టైటిల్ అందించాక అతడిని టీ20 కెప్టెన్ చేయాలనే డిమాండ్ మొదలైంది. ఇక బంగ్లాదేశ్ లో మూడో వన్డేలో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ కు ఈసారి సెంట్రల్ కాంట్రాక్టు దక్కే అవకాశమున్నట్టు సమచారం.
బీసీసీఐ కాంట్రాక్టుల జాబితా :
2022 లో బీసీసీఐ పునరుద్ధరించిన సెంట్రల్ కాంట్రాక్టుల జాబితా ఇది :
గ్రేడ్ ఏ+ - రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా (ఈ గ్రూప్ లో ఉన్నవాళ్లకు వార్షిక వేతనం రూ. 7 కోట్లు)
గ్రేడ్ ఏ - అశ్విన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కెఎల్ రాహుల్, మహ్మద్ షమీ (ఈ గ్రూప్ ఆటగాళ్లకు రూ. 5 కోట్ల వేతనం లభిస్తుంది)
గ్రేడ్ బి - ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ (వీరికి రూ. 3 కోట్ల వార్షిక వేతనం)
గ్రేడ్ సి - శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, శుభమన్ గిల్, హనుమా విహారి, యుజ్వేంద్ర చాహల్, సూర్యకుమార్ యాదవ్, వృద్ధిమాన్ సాహా, మయాంక్ అగర్వాల్, దీపక్ చాహర్ (వీళ్లకు యేటా రూ. 1 కోటి వేతనం)