క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం... కారు బాంబు దాడిలో అంపైర్ మృతి...
ఆఫ్ఘాన్ కారు బాంబు పేలుడు... తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆఫ్ఘాన్ అంపైర్...
మరో ప్రమాదంలో ఆఫ్ఘాన్ క్రికెటర్కి తీవ్ర గాయాలు..
ఐపీఎల్ 2020 ఎంజాయ్ని చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్కి మరో విషాద వార్త. క్రికెట్లో ఇప్పుడెప్పుడే ఎదుగుతూ మంచి జట్టుగా గుర్తింపు తెచ్చుకున్న ఆఫ్ఘనిస్తాన్కి ఒకే రోజు రెండు విషాద వార్తలు కలిచివేస్తున్నాయి. ఆఫ్ఘాన్ అంపైర్ బిస్మిల్లా జాన్ షిన్వారీ కారు బాంబు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆఫ్ఘాన్లోని షిన్వారీ జిల్లాలో జరిగిన దాడిలో బిస్మిల్లా జాన్ కుటుంబం హత్యకు గురైంది.
కారు బాంబు పేలిన సంఘటనలో15 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో అంపైర్ బిస్మిల్లా జాన్తో పాటు ఆయన కుటుంబంలోని ఏడుగురు సభ్యులు కూడా ఉన్నారు.
మరో ప్రమాదంలో ఆఫ్ఘాన్ క్రికెటర్, ఓపెనర్ నజీబుల్లా తరకాయ్ తీవ్రంగా గాయపడ్డాడు. 29 ఏళ్ల నజీబుల్లా కారుని మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నజీబుల్లా... ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు డాక్టర్లు...