Asianet News TeluguAsianet News Telugu

అలెర్ట్ : వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారా...అయితే మీ కంప్యూటర్లపై సైబర్‌ దాడులు జరగొచ్చు..

కరోనా ‘లాక్ డౌన్’తో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసే వారి కంప్యూటర్లపై ఇంటర్నెట్‌ రూపంలో ఎన్నో సైబర్‌ దాడులు సైబర్‌ దాడుల ముప్పు పొంచి ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ దాడులు జరిగితే నష్టాన్ని ఊహించలేమని, కీలక సమాచారం, ఖాతాల్లో బ్యాలెన్స్‌కు ప్రమాదం ఉన్నదని తెలుపుతున్నారు. వీటిని ఎదుర్కొనేందుకు సైబర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలతో రక్షణ ఉంటుందని అంటున్నారు.
 

Work from home makes you vulnerable to cyber attacks with computers
Author
Hyderabad, First Published May 4, 2020, 10:47 AM IST

కరోనా వైరస్‌ మహమ్మారి పరిశ్రమల రూపురేఖలను మార్చేసింది. వైరస్‌ విస్తరించకుండా చూడటం కోసం సేవల రంగ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (ఇంటి నుంచే పని) విధానాన్ని ఆచరణలో పెట్టాయి. ఐటీ, మీడియా తదితర పలు రంగాలు ఈ పద్దతిననుసరిస్తున్నాయి. 

వైరస్‌ ఇప్పట్లో కనుమరుగు కాకపోవచ్చని, వ్యాక్సిన్‌ వచ్చే వరకు సామాజిక దూరం పాటించక తప్పదని సైబర్ నిపుణులు అంటున్నారు. దీంతో భవిష్యత్ లోనూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం కొనసాగొచ్చని భావిస్తున్నారు.

వర్క్ ఫ్రం హోం విధానంలో ఉద్యోగులు తమ వ్యక్తిగత కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ సాయంతో ఇంటర్నెట్‌ ద్వారా కార్యాలయ సర్వర్లతో అనుసంధానమై పని చేయాలి. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే సైబర్‌ దాడుల ముప్పు ఎక్కువగా పొంచి ఉంటుంది. 

ఏ మాత్రం కొద్ది అవకాశం ఇచ్చినా సైబర్‌ నేరగాళ్లు కంప్యూటర్లు, సర్వర్లలోకి చొచ్చుకుపోయి నష్టానికి గురి చేయొచ్చు. కరోనా వైరస్‌ పేరుతో నిత్యం 2,600 సంస్థలపై సైబర్‌ దాడులు జరుగుతున్నాయని ఇటీవలే చెక్‌ పాయింట్‌ సర్వే వెల్లడించింది.

కనుక ఇటువంటి ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విలువైన డేటాతోపాటు, బ్యాంకు ఖాతాల్లోని డబ్బును జాగ్రత్తగా కాపాడుకునే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు సైబర్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం ఒక చక్కని పరిష్కారం. సైబర్‌ దాడి జరిగితే ఎదురయ్యే నష్టాన్ని సైబర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ భరిస్తుంది. 

కనుక ఆన్‌లైన్‌ వేదికగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న వారు, తమ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో కీలక సమాచారాన్ని ఉంచుకునే వారు తప్పకుండా ఈ సైబర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు.

దాదాపు అన్ని ప్రముఖ బీమా సంస్థలు.. బజాజ్‌ అలియాంజ్‌ జనరల్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్‌ బీమా సంస్థలు ఈ తరహా సైబర్‌ కవరేజీలను అందిస్తున్నాయి. 18 ఏళ్లు పైబడిన వారు ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులు. 

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో అయితే ఫ్యామిలీ ఫ్లోటర్‌ సైబర్‌ పాలసీని అందిస్తోంది. ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకుంటే ప్రీమియంపై 5 శాతం డిస్కౌంట్‌ కూడా ఆఫర్‌ చేస్తోంది. ప్రతీ ఏటా దీన్ని రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. బీమా సంస్థలను బట్టి కవరేజీ ఫీచర్లలో స్వల్ప మార్పులు ఉండొచ్చు.

ప్రధానంగా గుర్తింపు చోరీ, మీ ప్రమేయం లేకుండా ఇతరులు చేసే అనధికారిక ఆన్‌లైన్‌ లావాదేవీలు, డబ్బు కోసం డిమాండ్‌ చేస్తూ దాడి చేయడం (ఈ –ఎక్ట్సార్షన్‌), బెదిరింపులు (సైబర్‌ బుల్లీయింగ్‌), సాఫ్ట్‌వేర్‌ సాయంతో కంప్యూటర్లను అధీనంలోకి తీసుకోవడం (మాల్వేర్‌ దాడులు), కీలకమైన సమాచార వివరాలను (పాస్‌వర్డ్, యూజర్‌ నేమ్‌ వంటివి) చోరీ చేసే ఫిషింగ్‌ దాడులు, తప్పుదోవ పట్టించే, మోసపూరిత మెయిల్స్‌ (ఈమెయిల్‌ స్పూఫింగ్‌) తదితర దాడుల నుంచి సైబర్‌ పాలసీల్లో రక్షణ ఉంటుంది.

also read అవసరాలకు మించి డేటా వినియోగం అబద్దం: షియోమీ

వీటి వల్ల జరిగిన నష్టానికి పరిహారం కోసం క్లెయిమ్‌ చేసుకోవచ్చు. పరిహారం అన్నది గరిష్టంగా మీరు తీసుకునే సమ్‌ ఇన్సూర్డ్‌ వరకేనని గమనించాలి. సైబర్‌ దాడుల వల్ల ఎదురయ్యే న్యాయపరమైన చర్యల ఖర్చును కూడా బీమా సంస్థ నుంచి పొందే అవకాశం ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, బజాజ్‌ అలియాంజ్‌ సంస్థలు ఈ కవరేజీలు అన్నింటినీ ఆఫర్‌ చేస్తున్నాయి.

బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ అదనంగా సోషల్‌ మీడియా కవర్‌ను కూడా అందిస్తోంది. దీని కింద సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రొఫైల్‌పై దాడుల వల్ల గుర్తింపు వివరాల నష్టం జరిగితే పరిహారం తీసుకోవచ్చు. 

ఈ దాడుల వల్ల వేతన నష్టం జరిగితే హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో పరిహారం (గరిష్టంగా ఏడు రోజులకు మించకుండా) ఇస్తోంది. మొబిక్‌విక్‌ ప్లాట్‌ఫామ్‌పై లభించే ఐసీఐసీఐ లాంబార్డ్‌ సైబర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ అయితే అనధికారిక లావాదేవీల వల్ల కలిగే ఆర్థిక నష్టం, వేతన నష్టాలకు పరిహారం అందిస్తోంది.  

సైబర్‌ దాడి ఏదైనా కానీయండి.. ఏడు రోజుల్లోపు బీమా సంస్థకు తెలియజేయాలి. ఈ మెయిల్‌ లేదా ఫోన్‌ లేదా ఏజెంట్ల ద్వారా సమాచారం ఇవ్వొచ్చు. క్లెయిమ్‌ కోసం దరఖాస్తు చేస్తూ, ఆధారంగా అన్ని రకాల డాక్యుమెంట్లను సమర్పించాలి.

ఇవి అందిన రోజు నుంచి 30 రోజుల్లోగా బీమా సంస్థ క్లెయిమ్‌ను పరిష్కరిస్తుంది. క్లెయిమ్‌ ఫామ్, ఎఫ్‌ఐఆర్‌ కాపీ, సైబర్‌ దాడి జరిగినట్టు ఆధారాలు, లీగర్‌ నోటీసులు ఏవైనా అందుకుంటే ఆయా కాపీలను కూడా బీమా సంస్థకు అందించాల్సి ఉంటుంది.

సైబర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు ఎన్నో పరిమితులు, మినహాయింపులతో ఉంటాయి. ముఖ్యంగా పాలసీదారుడు ఒక ఏడాదిలో ఒకటే క్లెయిమ్‌ చేయగలరు.

ఒకటికి మించి దాడులు ఏకకాలంలో జరిగితే ఇందులో ఎక్కువ నష్టం జరిగిన దాడికి సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో పరిహారం చెల్లిస్తుంది. బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ ఆఫర్‌ చేస్తున్న సైబర్‌సేఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలో పరిహారానికి సంబంధించి ఉప పరిమితులు ఉన్నాయి. అంటే ప్రతి కవరేజీకి విడిగా గరిష్ట పరిహారాన్ని కంపెనీ పరిమితం చేసింది.

ఉదాహరణకు ఫిషింగ్, ఐటీ చోరీలో పరిహారం అన్నది బీమా మొత్తం (సమ్‌ ఇన్సూర్డ్‌)లో 25 శాతానికే పరిమితం అవుతుంది. ఉదాహరణకు రూ.1 లక్షకు పాలసీ తీసుకున్నట్టయితే ఫిషింగ్‌ ఘటనలో లభించే గరిష్ట పరిహారం రూ.25 వేలుగానే ఉంటుంది. 

అదే విధంగా ఈమెయిల్‌ స్పూఫింగ్‌లో గరిష్ట బీమా 15 శాతానికే పరిమితం అవుతుంది. మిగిలిన అన్ని దాడుల్లోనూ పరిహారం బీమా కవరేజీలో 10 శాతంగానే ఉంటుందని గమనించాలి. 

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఈ సెక్యూర్‌ సైబర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలో సైబర్‌ బుల్లీయింగ్, ఈ ఎక్ట్సార్షన్, ఈ రిప్యుటేషన్‌ (పేరు ప్రతిష్ట) నష్టానికి క్లెయిమ్‌ చేసుకోవాలంటే 45 రోజులు వేచి ఉండే నిబంధన అమల్లో ఉంది. అంటే పాలసీ తీసుకున్న 45 రోజుల తర్వాతే వీటి విషయంలో క్లెయిమ్‌ హక్కు లభిస్తుంది. 

ఈ రిప్యుటేషన్‌ నష్టం, గుర్తింపు వివరాల చోరీ, ఈమెయిల్‌ స్పూఫింగ్‌ ఘటనల్లో లభించే పరిహారం గరిష్టంగా బీమా కవరేజీలో 25 శాతంగానే ఉంటుంది. ఫిషింగ్‌లో ఇది 15 శాతం, సైకలాజికల్‌ కౌన్సిలింగ్, ఈ ఎక్ట్సార్షన్, సైబర్‌ బుల్లీయింగ్, మాల్వేర్‌ దాడుల్లో గరిష్ట పరిహారం 10%. అదే విధంగా క్లెయిమ్‌ మొత్తం రూ.50,000 మించి ఉంటే కనీసం రూ. 3,500ను తగ్గించి ఇస్తుంది. ఐసీఐసీఐ లాం బార్డ్‌ సైబర్‌ పాలసీలో 10% లోపే ఆప్షన్‌ ఉంది. అంటే పాలసీదారు క్లెయిమ్‌ మొత్తంలో తన వంతు 10 శాతాన్ని భరించాల్సి ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios