Asianet News TeluguAsianet News Telugu

నలుగురిలో ఒకరు నిరుద్యోగి.. కరోనాతో ముంచుకొస్తున్న ఉద్యోగ భద్రత..

కరోనా ‘లాక్ డౌన్’ వల్ల దేశవ్యాప్తంగా గత మార్చి 25 నుంచి ఈ నెల మూడో తేదీ వరకు నిరుద్యోగిత రేటు 27.1 శాతం పెరిగింది. ఇది అమెరికాలో నిరుద్యోగ భ్రుతి కోసం దరఖాస్తు చేసుకున్న వారి కంటే నాలుగు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారని, మున్ముందు మరింత ముప్పు పొంచి ఉందని సీఎంఐఈ నిర్వహించిన అధ్యయనం తెలిపింది. 

One in 4 employed lost job across India in March-April: CMIE
Author
Hyderabad, First Published May 6, 2020, 12:19 PM IST

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌‌డౌన్ కోట్ల మంది ఉద్యోగులను రోడ్డున పడేస్తోంది. పలు రంగాల వ్యాపారాలు కుదేలయ్యాయి. 

ఉద్యోగులు నిరుద్యోగులు అయ్యారు. గత నెలలో భారతదేశంలో 12.2 కోట్ల మంది ప్రజలు నిరుద్యోగులుగా మారారని తాజా నివేదికలు చెబుతున్నాయి. సగటున ప్రతి నలుగురిలో ఒకరు నిరుద్యోగులవుతున్నారని తేలింది. 

ఈ నెల మూడో తేదీ నాటికి దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు 27.1 శాతానికి పెరిగినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఐఎంఈ) డేటా సర్వేలో వెల్లడైంది. లాక్‌‌డౌన్‌‌ వల్ల వ్యాపారాలు మూత పడ్డాయని, ఎంప్లాయిమెంట్ దెబ్బతిందని పేర్కొంది.

రోజువారీ కూలీలకు, చిన్న వ్యాపార సంస్థల్లో పనిచేసే వారిపై లాక్‌‌డౌన్ ప్రభావం ఎక్కువగా ఉందని సీఐఎంఈ సర్వే తెలిపింది. వీరిలో రోడ్డు పక్కన చిన్న వ్యాపారాలు నిర్వహించుకునే వారు, నిర్మాణ రంగంలో పనిచేసే వారు ఎక్కువగా ఉన్నారని పేర్కొంది. ఇది చాలా బాధాకరమైన విషయమని సీఎంఐఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మషేశ్ వ్యాస్ అన్నారు.

భారతదేశంలో ఉద్యోగాలు పోయిన వారి సంఖ్య, అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్న వారికంటే నాలుగు రెట్లు అధికంగా ఉందని సీఎంఐఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మషేశ్ వ్యాస్ పేర్కొన్నారు. అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం 3 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు.

చాలా ఏరియాల్లో లాక్‌‌డౌన్ పొడిగించడంతో, నిరుద్యోగుల సంఖ్య ఇంకా పెరుగుతుందని సీఐఎంఈ హెచ్చరించింది. లాక్‌‌డౌన్ తొలుత అసంఘటిత రంగంలో పనిచేసే వారిపై పడిందని సీఎంఐఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మషేశ్ వ్యాస్ తెలిపారు.

also read  లాక్‌డౌన్ ఎఫెక్ట్: రిటైల్‌కు లక్షల్లో లాస్.. ఆదుకోకుంటే కష్టమే..

ఆ తర్వాత సంఘటిత రంగాల్లోని ఉద్యోగాలపై కూడా ప్రభావం చూపుతుందని సీఎంఐఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మషేశ్ వ్యాస్ అన్నారు. స్టార్టప్‌‌లు, ఇతర ఇండస్ట్రీ అసోసియేషన్లు కూడా ఉద్యోగులను తీసేస్తున్నారని చెప్పారు. చాలా మంది ఇప్పుడు కొత్త జాబ్ కోసం చూస్తున్నారని, ఈ రేటు 36.2 శాతం పెరిగిందని వ్యాస్ అన్నారు.

మార్చి మధ్యలో 7 శాతం ఉన్న నిరుద్యోగిత రెండు విడతల లాక్‌డౌన్‌ ముగిసిన మే 3వ తేదీ నాటికి 27.11 శాతానికి దూసుకుపోయింది. ముంబైకి చెందిన సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తెలిపింది. 

రెడ్‌ జోన్లు అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత అధికంగా 29.22 శాతం ఉన్నట్టు సీఎంఐఈ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇది 26.69 శాతం ఉంది. ముంబై, ఢిల్లీ వంటి నగరాల నుంచి వలస పనివారు భారీ సంఖ్యలో స్వంత ప్రాంతాలకు తరలిపోతూ ఉండడమే తమ ఉద్యోగితపై వారికి ఏర్పడిన అపనమ్మకానికి తార్కాణమని సీఎంఐఈ నివేదిక పేర్కొంది. 

ఆర్థిక వ్యవస్థలో అధికంగా ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నది అవ్యవస్థీకృత రంగంలోనే కావడం వల్ల నిరుద్యోగిత ప్రభావం అధికంగా ఉన్నట్టు తెలిపింది. రాష్ర్టాలవారీ పుదుచ్చేరిలో అత్యధికంగా 75.8 శాతం నిరుద్యోగిత ఉంది. తమిళనాడు, జార్ఖండ్‌, బీహార్‌, హర్యానా  ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios