Asianet News TeluguAsianet News Telugu

లాక్‌డౌన్ ఎఫెక్ట్: మరో 'బ్లాక్ మండే'గా రికార్డు.. 5.8 లక్షల కోట్ల సంపద ఆవిరి..

కరోనా భీభత్సం దేశీయ స్టాక్ మార్కెట్లను నిలకడగా ముందుకు సాగనివ్వడం లేదు. మూడో దఫా లాక్ డౌన్ పొడిగింపు, చైనా-అమెరికా మధ్య ట్రేడ్ వార్ సంకేతాల మధ్య ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా సోమవారం మరో బ్లాక్ మండేగా రికార్డైంది. 
 

Investors lose Rs 5.8 trillion as Sensex tumbles
Author
Hyderabad, First Published May 5, 2020, 10:16 AM IST

ముంబై: కరోనా వైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ రెండో సారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో మరో బ్లాక్ మండే నమోదైంది. లాక్ డౌన్ పొడిగింపుతో మదుపర్లలో సెంటిమెంట్ బలహీన పడి రూ.5.8 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. 

లాక్‌డౌన్‌ పొడగింపు, అగ్ర ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య ముదురుతున్న ట్రేడ్ వార్  భయాలు ఇబ్బందికరంగా మారాయి. కరోనా ఉపద్రవానికి చైనానే కారణమంటూ అమెరికా విదేశాంగ మంత్రి ఆరోపణలు గుప్పించడం వివాదం తారస్థాయికి చేరినట్లు కనిపించడంతో మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ప్రపంచమార్కెట్లు ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సోమవారం ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ 1700 పాయింట్ల మేర పతనమైంది. 

సోమవారం ఆరంభ నష్టాల నుంచి మరింత బలహీన పడిన మార్కెట్ ఒక దశలో 2 086 పాయింట్లు లేదా 6 శాతం కుప్పకూలింది. బ్యాంకింగ్, ఆటో, మెటల్, రియాల్టీ  షేర్లు బాగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్ 1791 పాయింట్లు లేదా 8శాతం పైగా పడిపోయి 19,744 స్థాయిలకు చేరుకోగా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 7.86 శాతం క్షీణించింది. 

also read రతన్ టాటా పై ఫెక్ న్యూస్... ఆందోళన..సోషల్ మీడియాలో వైరల్...

ప్రధానంగా ఆసియా ఈక్విటీలలోని భారీ అమ్మకాల ప్రభావంతో  ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది.దీంతో బిఎస్‌ఇ-లిస్టెడ్ కంపెనీల్లో నేటి పతనంతో రూ. 5.8 ట్రిలియన్ల పెట్టుబడిదారుల సంపద తుడుచిపెట్టుకు పోయింది.  మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,15,309 కోట్లు తగ్గి 1,24,26,311.83 కోట్లకు చేరుకుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ (11 శాతం తగ్గి) ఇండెక్స్‌లో అత్యధిక నష్టాన్ని చవిచూడగా, బజాజ్ ఫైనాన్స్ (10 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ (10 శాతం) ఇండస్ఇండ్ బ్యాంక్ (9.6 శాతం) భారీగా నష్టపోయాయి. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో మార్చి 2020 తో ముగిసిన త్రైమాసికంలో నిరాశాజనక ఫలితాలతో టెక్ మహీంద్రా 8 శాతం, హిందూస్థాన్ యూనిలీవర్  5 శాతం క్షీణించింది.

నిఫ్టీ  ఫార్మ మాత్రమే స్వల్పంగా లాభపడింది. అలాగే కొన్ని షరతులతో మద్యం దుకాణాలను ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతించిన తరువాత బ్రూవరీస్ అండ్ డిస్టిలరీ కంపెనీల షేర్లు  దాదాపు 11 శాతం వరకు ర్యాలీ చేశాయి. చివరికి 2002 పాయింట్లు పతనంతో సెన్సెక్స్ 31715వద్ద,  నిఫ్టీ 566  పాయింట్లు  కుప్పకూలి 9293  వద్ద స్థిరపడ్డాయి. తద్వారా  సెన్సెక్స్ 32 వేల దిగువకు చేరగా, నిఫ్టీ 9300 స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. 

డాలరుతో రూపాయి మారకం విలువ 75.71గా ఉంది. ఒక్క ఫార్మా రంగ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు కుదేలయ్యాయి. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, వేదాంత, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. భారతీ ఎయిర్‌టెల్‌, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫర్మా షేర్లు లాభాలు నమోదు చేశాయి.

Follow Us:
Download App:
  • android
  • ios