వాల్మార్ట్ చేతికి ఫ్లిప్ కార్ట్ చిక్కేనా?: ట్రేడర్ల కొలికి
అమెరికా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్, దేశీయ ఈ - కామర్స్ జెయింట్ ఫిల్ప్ కార్ట్ మధ్య కుదిరిన వాటాల విక్రయ ఒప్పందంపై చిన్న వ్యాపారులు భగ్గమంటున్నారు. ఈ - కామర్స్పై కేంద్రం ఎటువంటి విధానం ప్రకటించకపోవడంతో తాము నష్టపోవాల్సి వస్తున్నదని ఆందోళన చెందుతున్నారు.
న్యూఢిల్లీ: ఇండియన్ ఆన్లైన్ దిగ్గజం ఫిల్ప్కార్ట్ సంస్థలో 77 శాతం వాటా (16 బిలియన్ల డాలర్లు)ను అమెరికా కార్పొరేట్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్, మధ్య కుదుర్చుకున్న ఒప్పందం పట్ల వ్యాపారులు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతున్నారు. సోమవారం దేశవ్యాప్తంగా 1000 ప్రాంతాల్లో సుమారు పది లక్షల మంది వ్యాపారులు నిరసన తెలుపుతున్నారు. ఫిల్స్కార్ట్లో వాటాలను వాల్ మార్ట్ కొనుగోలు చేయడంపైనే వ్యాపారుల తీవ్ర అభ్యంతరం చెబుతున్నారని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియన్ ట్రేడర్స్ (సీఏఐటీ) సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు.
ఈ - కామర్స్ పై విధానమేదని నిలదీసిన ఖండేల్వాల్
ఈ - కామర్స్పై ఎటువంటి విధానం లేదని ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. కానీ ఎఫ్డీఐ పాలసీ మేరకు వాల్మార్ట్ సంస్థకు ఫిల్ప్కార్ట్ను కేక్ వాక్ గా అప్పగించనుండటం సరి కాదన్నారు. దీనిపై ఇప్పటికే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో తమ సంస్థ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. గత కొన్నేళ్లుగా ‘ఈ - కామర్స్’ బిజినెస్లో పాల్గొంటున్న పలు సంస్థలు అన్ని రకాల అవకతవకలకు పాల్పడ్డాయని ప్రవీణ్ ఖండేల్వాల్ ఆరోపించారు. కొల్లగొట్టే రీతిలో ముందస్తు ధరల నిర్ణయం, భారీగా రాయితీలు ప్రకటించడంతోపాటు భారీగా నిధుల నష్టం జరుగుతున్నదన్నారు. దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫిల్ప్ కార్ట్, అమెరికా రిటైల్ జెయింట్ వాల్ మార్ట్ మధ్య ఒప్పందాన్ని న్యాయస్థానంలోనూ సవాల్ చేస్తామని ప్రవీణ్ ఖండేల్వాల్ తేల్చి చెప్పారు.
వాల్మార్ట్తో చిన్న వ్యాపారులు పోటీ పడలేరు
దేశీయంగా చిన్న తరహా వ్యాపార లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రదానమంత్రి నరేంద్రమోదీ పలు ప్రకటనలు చేస్తున్నారని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియన్ ట్రేడర్స్ (సీఏఐటీ) సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. అయితే ఫిల్ప్ కార్ట్, వాల్ మార్ట్ సంస్థల మధ్య కుదిరిన వాటాల విక్రయ ఒప్పందం నేరుగా దేశంలోని చిన్న వ్యాపారులు దారుణంగా దెబ్బ తింటారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ చిల్లర వ్యాపారులు వాల్ మార్ట్ వంటి దిగ్గజ సంస్థలతో పోటీ పడలేరని పేర్కొన్నారు. కనుక ఇప్పటికైనా ఈ రెండు సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందంపై కేంద్రం జోక్యం చేసుకుంటుందని తాము అంచనా వేస్తున్నట్లు తెలిపారు.