ఇండియాలోకి కొత్త రకం కరోనా వైరస్.. ముందుజాగ్రతగా జనవరి 7 వరకు ఆ విమానాలపై నిషేధం..
బ్రిటన్ నుండి వచ్చే విమానాల నిషేధాన్ని 31 డిసెంబర్ 2020 నుండి 7 జనవరి 2021కు పెంచుతూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బ్రిటన్ దేశంలో కొత్త తరహా కరోనా వైరస్ కారణంగా భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. బ్రిటన్ నుండి వచ్చే విమానాల నిషేధాన్ని 31 డిసెంబర్ 2020 నుండి 7 జనవరి 2021కు పెంచుతూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు ఈ నిషేధం 23 డిసెంబర్ నుండి 31 వరకు విధించింది.
పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ సమాచారం వెల్లడించారు. కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి వల్ల లండన్తో సహా యూ.కే లోని అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ తిరిగి అమలు చేసింది. గత కొన్ని రోజుల క్రితం బ్రిటన్ నుండి భారత దేశానికి తిరిగి వచ్చిన 20 మందిలో ఈ కొత్త జాతి వైరస్ ని కనుగొన్నారు, వీరిలోఆరుగురుకి కొత్త వైరస్ సొకినట్లు గుర్తించారు.
కొత్త రకం కరోనా కేసులు ఢీల్లీలో గరిష్ట సంఖ్యలో కనిపిస్తున్నాయి. అయితే కొత్త వైరస సంబంధించి 14 నమూనాలలో ఎనిమిది ఢీల్లీలోని ఎన్సిడిసి ల్యాబ్లో, బెంగళూరు ల్యాబ్లో ఏడు, కోల్కతా ఇంకా పూణేలోని ల్యాబ్లలో కొన్ని కేసులను గుర్తించారు. హైదరాబాద్లోని సిసిఎంబిలో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి.
నవంబర్ 25 నుండి డిసెంబర్ 23 మధ్య బ్రిటన్ నుండి భారతదేశానికి వివిధ విమానాశ్రయాల నుండి సుమారు 33,000 మంది ప్రయాణికులు వచ్చారు. ఈ ప్రయాణీకులందరినీ గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఆర్టి-పిసిఆర్ టెస్టులు నిర్వహిస్తున్నాయి.
ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు బ్రిటన్ - భారతదేశం మధ్య విమానాల రాకపోకలను డిసెంబర్ 23 నుండి డిసెంబర్ 31 వరకు వాయిదా వేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గత వారం ప్రకటించారు. ఇప్పుడు ఈ నిషేధాన్ని జనవరి 7 వరకు పెంచింది.
బ్రిటన్ లో కొత్త కరోనా వైరస్ కనుగొనబడినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు ఏర్పడ్డాయి. చాలా దేశాలు బ్రిటన్ నుండి వచ్చే విమానాలను నిషేధించడం ప్రారంభించాయి. ఈ నేపధ్యంలో ముందుజాగ్రత్తగా బ్రిటన్ నుండి వచ్చే విమానాలను కూడా భారత్ నిలిపివేసింది. ఇది విమానయాన పరిశ్రమను మరింతగా దెబ్బతీసే అవకాశం ఉంది.