కేంద్రం సహకరించకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది గ్రాంట్లు, నిధులు, పరిహారంతో సహా దాదాపు 50 వేల కోట్ల మేర నష్టపోయిందని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

BRS ప్రభుత్వం ఇప్పుడు తన రెండవ పదవీకాలం ముగిసేలోపు ఫిబ్రవరి 7 న తన చివరి బడ్జెట్‌ను సమర్పించడానికి సన్నద్ధమవుతోంది. మొత్తం 3 లక్షల కోట్ల వరకు బడ్జెట్‌ వ్యయం అయ్యే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున, రైతుబంధు, దళిత బంధు, రుణమాఫీ, డజనుకుపైగా ఇతర సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, గిరిజన బంధు వంటి కొత్త పథకాలను ప్రవేశపెట్టి నిధులు కూడా కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోందని అధికారిక వర్గాలు తెలిపాయి. అలాగే డబుల్ బెడ్ రూం పథకం రెండవ దశ గొర్రెల పంపిణీ పథకం కోసం. ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బడ్జెట్‌లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల పనుల కోసం వ్యవసాయం , నీటిపారుదల రంగాలు , మూలధన వ్యయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, దీనికి 2023-24 బడ్జెట్‌లో కూడా ప్రాధాన్యత కొనసాగుతుందని వర్గాలు తెలిపాయి.

అన్ని రంగాలకు సంబంధించిన బడ్జెట్ అంచనాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఆసరా పెన్షన్‌తోపాటు రైతుబంధు, దళిత బంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌లు తదితర సంక్షేమ పథకాలకు ప్రభుత్వం దాదాపు 50 వేల కోట్ల నుంచి 60 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తోంది.

కేంద్రం సహకరించకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది గ్రాంట్లు, నిధులు, పరిహారంతో సహా దాదాపు 50 వేల కోట్ల మేర నష్టపోయిందని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. "రాష్ట్రాలు తమ విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తేనే ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిలో 0.5% అనుమతిస్తామని కేంద్రం స్పష్టంగా చెప్పిందని. మేము సంస్కరణలను అమలు చేయడానికి నిరాకరించామని, దీని ఫలితంగా 6,000 కోట్ల నష్టం వాటిల్లింది" అని ఆయన అన్నారు.

రెవెన్యూ నష్టం, కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందకపోవడాన్ని పూడ్చేందుకు ఇప్పటి వరకు సుమారు 10 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను వేలం వేసి భారీగా వనరుల సమీకరణ చేపట్టామని అధికారులు తెలిపారు.