బ్లాక్మనీ ఇష్యూ: తెలుగు ఇండస్ట్రీయలిస్టు ‘పొట్లూరి’కి స్విస్ నోటీసులు
నల్లధనాన్ని వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సుగమం అయ్యాయని తెలుస్తోంది. అందులో భాగంగానే పొట్లూరి రాజ రామ్మోహన్ రావు అనే పారిశ్రామికవేత్తకు స్విస్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. మీ పేరు ప్రభుత్వానికి అందజేయడం అభ్యంతరం ఉంటే 10 రోజుల్లో అప్పీల్ చేసుకోవాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.
న్యూఢిల్లీ/బెర్న్: తమ దేశ బ్యాంకుల్లో అక్రమంగా నిధులు దాచుకున్న భారతీయులపై స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. తాజాగా పొట్లూరి రాజమోహన్ రావు అనే పారిశ్రామికవేత్తకు నోటీసులు అందాయి.
మీ బ్యాంక్ ఖాతా వివరాలు భారత ప్రభుత్వానికి చెప్పేందుకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే.. పది రోజుల్లో అప్పీల్ చేసుకోవాలని స్విట్జర్లాండ్లోనిన ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్టీఏ) తన నోటీసుల్లో పేర్కొంది. గత నెల 28న రాజమోహన్ రావుకు ఈ నోటీసులు అందినట్టు సమాచారం.
రాజమోహన్ రావు పేరు, అతడి పుట్టిన తేదీ, భారతీయుడనే వివరాలు తప్ప, మరే వివరాలను ఎఫ్టీఏ బయట పెట్టలేదు. గత నెల 21వ తేదీన కూడా తమ బ్యాంకుల్లో అనుమానాస్పద ఖాతాలు ఉన్న 14 మంది భారతీయులకు స్విస్ బ్యాంకులు ఇలాగే నోటీసులు జారీ చేశాయి.
భారత్తో కుదిరిన ఒప్పందం ప్రకారం స్విట్జరాండ్ ప్రభుత్వం తమ బ్యాంకుల్లో భారతీయులకు ఉన్న అనుమానాస్పద ఖాతాల వివరాలను, ఈ సంవత్సరం జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తోంది.
ఎఫ్టీఏ జారీ చేసిన నోటీసుల ప్రకారం పొట్లూరి రాజమోహన్ రావు వివరాలు పెద్దగా తెలియడం లేదు. అందుబాటులో ఉన్న వివరాల మేరకు రాజమోహన్ రావు బెంగుళూరు కేంద్రంగా పనిచేసే యునైటెడ్ టెలికామ్స్ లిమిటెడ్ అనే కంపెనీ డైరెక్టర్ అని తెలుస్తోంది.
యునైటెడ్ టెలికామ్స్ లిమిటెడ్ టీవీలు, రేడియో రిసీవర్లు, సౌండ్ అండ్ వీడియో రికార్డింగ్స్ వంటి వస్తువులు ఉత్పత్తి చేస్తోంది. స్టాక్ ఎక్స్చేంజ్ల్లో నమోదు కాని, ఈ కంపెనీ డైరెక్టర్ల బోర్డులోని మిగతా సభ్యులంతా రాజమోహన్ రావు బంధుమిత్రులని సమాచారం. యునైటెడ్ టెలికమ్స్ లిమిటెడ్ కంపెనీతో పాటు రాజమోహన్ రావు మరో ఏడు కంపెనీల్లోనూ డైరెక్టర్గా ఉన్నారు.