Asianet News TeluguAsianet News Telugu

మరి కరోనా ఎఫెక్ట్: వడ్డీరేట్ల తగ్గించేసిన ఎస్బీఐ.. బట్


ఇక ఇంటి, వ్యక్తిగత, వాహన, పెట్టుబడి రుణాలపై వడ్డీరేట్లను తగ్గించి వేస్తూ ఎస్బీఐ నిర్ణయం తీసుకున్నది. 75 బేసిక్ పాయింట్ల మేరకు ఎస్బీఐ రుణాలపై వడ్డీరేటు తగ్గించింది. డిపాజిట్లపై వడ్డీరేట్లు 20 నుంచి 100 బీపీఎస్ తగ్గుతుంది.

SBI lowers lending rate by 75 bps, deposit rate between 20-100 bps
Author
Hyderabad, First Published Mar 28, 2020, 10:40 AM IST

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించిన కొన్ని గంటల వ్యవధిలోనే దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) సానుకూల నిర్ణయం తీసుకున్నది. వడ్డీరేట్లను ఏకంగా 75 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తూ ఎస్బీఐ నిర్ణయం తీసుకున్నది. ఈ నూతన వడ్డీరేట్లు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నుంచి అమలులోకి రానున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.

దీంతోపాటు రిటైల్‌, బల్క్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు కూడా 20 బేసిస్‌ పాయింట్ల నుంచి 100 బేసిస్‌ పాయింట్ల వరకు కోత విధిస్తూ ఎస్బీఐ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయంతో ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌-లింక్డ్‌ లెండింగ్‌ రేటు(ఈబీఆర్‌), రెపో-లింక్డ్‌ లెండింగ్‌ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)తో అనుసంధానమై అన్ని రకాల రుణాలపై వడ్డీరేటు మరింత తగ్గనున్నదని తెలిపింది.

దీంతో ఈబీఆర్‌ రేటు 7.80 శాతం నుంచి 7.05 శాతానికి తగ్గనుండగా, ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 7.40 శాతం నుంచి 6.65 శాతానికి దిగి రానున్నది. బ్యాంక్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో 30 ఏళ్ల కాల పరిమితి కలిగిన రూ. లక్ష రుణంపై ఈఎంఐ రూ.52 తగ్గనున్నది. మరోవైపు బ్యాంక్‌ అసెట్‌ లయబిలిటీ కమిటీ వచ్చే నెలలో సమావేశమై మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేటు తగ్గింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు రజనీశ్ కుమార్‌ వెల్లడించారు. 

ఆర్బీఐ తీసుకున్న మూడు నెలల మారటోరియంతో బ్యాంకుకు రావాల్సిన మొత్తం రుణాల్లో రూ.50 వేల నుంచి రూ.60 వేల కోట్ల వరకు చెల్లింపులు నిలిచిపోనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ప్రతియేటా రూ.2-2.5 లక్షల కోట్ల వరకు రుణాలను వసూలు చేస్తుండగా, వీటిలో వచ్చే మూడు నెలల్లో రూ.60 వేల కోట్ల వరకు వసూలు కాకపోవచ్చునని బ్యాంక్‌ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ చెప్పారు. 

ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి రిజర్వుబ్యాంక్‌ ఉదారంగా వడ్డీరేట్లను తగ్గిస్తున్నా బ్యాంకులు మాత్రం పెడచెవిన పెడుతున్నాయి. 2019లో వరుసగా ఐదుసార్లు  135 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీరేట్లు తగ్గిస్తే బ్యాంకులు మాత్రం 35-40 బేసిస్‌ పాయింట్లు తగ్గించి చేతులు జులుపుకున్నాయి. 

కానీ, ఈసారి కరోనా వైరస్‌తో కుదేలవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టడానికి ఆర్బీఐ ఏకంగా 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. బ్యాంకులు ఏ మేరకు తగ్గిస్తాయో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో డిసెంబర్‌, ఫిబ్రవరి నెలల్లో జరిగిన సమీక్షల్లో వడ్డీరేట్లు యథాతథంగా ఉంచింది. 

కరోనా వైరస్‌ ఎవ్వర్నీ వదలడంలేదు. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితులు నెలకొనడంతో బ్యాంక్‌ ఖాతాదారుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. దీంతో గత 15 రోజుల్లో బ్యాంకుల నుంచి డిపాజిటర్లు రూ.53 వేల కోట్ల నగదు ఉపసంహరించుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ వచ్చే నెల చివరినాటికి పొడిగించడంతో డబ్బులకు కొరత ఉంటుందన్న భయాలు వారిలో స్పష్టంగా కనిపించాయి. దీంతో ఈ నెల 13తో ముగిసిన తొలి పక్షం రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన నిధుల్లో రూ.53 వేల కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారని ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.  

డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడంలేదు. భారతీయులు కరెన్సీ రూపంలోనే అత్యధికంగా లావాదేవీలు జరుపుతున్నారని ఆర్బీఐ నివేదిక స్పష్టంచేసింది. ఈ నెల 13 నాటికి ప్రజల వద్ద రూ.23 లక్షల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయని పేర్కొంది. 

ముందస్తు చర్యల్లో భాగంగా బ్యాంకుల శాఖలు, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ కష్టమవుతున్నదన్న అంచనాతో అత్యధిక మంది నగదు ఉపసంహరించుకున్నారని యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రధాన ఆర్థికవేత్త సుగాటా భట్టచార్య తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios