‘షియో మీ’ ప్రభంజనం: 20 లక్షల సేల్స్ టార్గెట్?
చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ భారత్లో అమ్మకాల ప్రభంజనం సృష్టిస్తోంది
న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ భారత్లో అమ్మకాల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ‘బిగ్ బిలియన్ డేస్’, ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ పేరుతో వినియోగదారుల ముందుకు వచ్చాయి. పలు ఉత్పత్తులపై భారీ రాయితీలు ఆఫర్ చేశాయి. దీంతో పాటు షియోమీ సొంత సైట్ ఎంఐడాట్కామ్ ద్వారానూ సొంత ఉత్పత్తుల అమ్మకాలు ప్రారంభించింది.
ఈ మూడింటి ద్వారా ఎక్కువగా విక్రయిస్తున్న వస్తువుల్లో షియోమీ ముందు వరుసలో నిలిచింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ఏకంగా 25 లక్షల వస్తువులను విక్రయించినట్టు షియోమీ పేర్కొంది. వీటిలో స్మార్ట్ఫోన్లు, ఎంఐ ఎల్ఈడీ టీవీల, ఎంఐ బ్యాండ్ 3, ఎంఐ పవర్ బ్యాంకులు, ఎంఐ ఇయర్ ఫోన్లు, ఎంఐ రౌటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నట్టు తెలిపింది.
ఈనెల 9న మధ్యాహ్నం 12 గంటల నుంచి 11న సాయంత్రం 7 గంటలకు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగినట్టు షియోమీ తెలిపింది. అయితే, మొత్తంగా 20 లక్షల స్మార్ట్ఫోన్లను విక్రయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు షియోమీ వివరించింది. కాగా, గతేడాది సెప్టెంబరు 20-22 మధ్య నిర్వహించిన ఫెస్టివ్ సేల్లో షియోమీ మిలియన్ స్మార్ట్ఫోన్లను విక్రయించింది.