రిటైల్ పేమెంట్స్ లోకి ముకేశ్ అంబానీ.. ఆర్బిఐ పరిశీలనలో అప్లికేషన్లు..
ప్రైవేట్ రిటైల్ పేమెంట్స్ వ్యవస్థలో అడుగు పెట్టేందుకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వేచి చూస్తున్నారు. ఈ వ్యవస్థ రూపకల్పనకు అవసరమైన విధి విధానాలను, మార్గదర్శకాలను ఆర్బీఐ రూపొందిస్తున్నది.
ముంబై: భారత చిల్లర చెల్లింపుల వ్యవస్థలోకి దేశంలోని టాప్ కార్పొరేట్ కంపెనీలు ప్రవేశించనున్నాయి. జాతీయ స్థాయిలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) లాంటి రిటైల్ పేమెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేసి, ఆపరేట్ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ) ప్రైవేట్ సంస్థలకు అనుమతి ఇవ్వాలనుకుంటోంది. దీనికోసం మార్గదర్శకాలను కూడా రూపొందిస్తోంది.
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, పేమెంట్ కంపెనీ పేటీఎం, క్యాపిటల్ మార్కెట్ ఎక్స్చేంజ్లు ఎన్ఎ స్ఈ, బీఎస్ఈ లాంటి టాప్ సంస్థలు ఈ లైసెన్స్ పొందేందుకు చూస్తున్నాయి. ఎన్పీసీఐ లాంటి ప్లాట్ఫామ్ ఆపరేట్ చేసేందుకు ఈ సంస్థలు పోటీ పడుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ఎన్పీసీఐ ప్రస్తుతం అన్ని ఎలక్ట్రానిక్ రిటైల్ పేమెంట్లకు ఒక హబ్గా ఉంది. యూపీఐ పేమెంట్స్ అందిస్తున్న భీమ్యాప్ను ఎన్పీసీఐనే రూపకల్పన చేసింది. నోట్ల రద్దు హయాం నుంచి దేశంలో డిజిటల్ పేమెంట్లు ఊపందుకోవడానికి ఒక ప్రధాన కారణంగా భీమ్ యాప్ను చెప్పుకోవచ్చు.
ఎలక్ట్రానిక్ రిటైల్ పేమెంట్స్ మార్కెట్లో ఎన్పీసీఐదే అగ్రస్థానం. యూపీఐ, ఎన్ఏసీహెచ్, నేషనల్ ఫైనాన్సియల్ స్విచ్, ఐఎంపీఎ వంటి ముఖ్యమైన ప్లాట్ఫామ్స్కు ఇదే బాధ్యత వహిస్తోంది. ఇప్పుడు ఈ మార్కెట్లోకి ప్రైవేట్ సంస్థలను ఆర్బీఐ అనుమతి ఇస్తోంది. ఆర్బీఐ ఇస్తున్న ఈ అవకాశాన్నిఅందిపుచ్చుకోవడానికి రిలయన్స్, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, పేటీఎం వంటి సంస్థలు అడ్వయిజరను్లను కూడా నియమించుకున్నాయి.
also read ఆర్బిఐ షాకింగ్ న్యూస్: రూ.68 వేల కోట్ల కార్పొరేట్ రుణాలు మాఫీ..
దీనికి సంబంధించిన విధివిధానాలపై ప్రైవేట్ కంపెనీలు, ఆర్బీఐతో సంప్రదిస్తున్నాయి. పేమెంట్ సెటిల్మెంట్ చేసేందుకు తమ వద్ద నైపుణ్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్టు కంపెనీలు భావిస్తున్నాయి. ఎన్పీసీఐ లాంటి సంస్థను ఏర్పాటు చేసే అవకాశం ఎవరికి దక్కినా కూడా ఇండియాలో వచ్చే పేమెంట్ రివల్యూషన్లో వారే ముందంజలో ఉండనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ప్రతిపాదిత సంస్థను ఆర్బీఐ నియంత్రించనుంది. పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ (ట్పీఎస్ఎస్ఏ) 2007 కింద ఆథరైజ్ చేయనుంది. ఈ ఏడాది చివరి వరకు దీని గైడ్లైన్స్ను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కనీసం రెండు లైసెన్స్లను జారీ చేయాలని చూస్తోంది.
ముసాయిదా నిబంధనల ప్రకారం, న్యూ అంబ్రెల్లా ఎంటిటీకి మినిమమ్ పేయిడ్ అప్ క్యాపిటల్ రూ.500 కోట్ల వరకు ఉండాలి. అయితే ఈ క్యాపిటల్లో ప్రమోటర్ వాటా 40 శాతంకంటే ఎక్కువ ఉండకూడదు. అర్హత గల ప్రమోటర్ సర్వీసు ప్రొవైడర్గా, పేమెంట్స్రంగంలో టెక్నాలజీ పార్టనర్గా కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
మరోవైపు రిలయన్స్ రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించుకోవాలని నిర్ణయించింది. ఎన్నినిధులను సేకరిస్తుందనే వివరాలను కంపెనీ బయటపెట్టలేదు. అప్పులను తగ్గించడానికే రైట్స్ ఇష్యూను ఎంచుకుందని విశ్లేషకులుచెబుతున్నారు. కంపెనీకి ప్రస్తుతం 23లక్షల మంది షేర్హోల్డర్లు ఉన్నారు. అంబానీ, ఆయన ఫ్యామిలీకి 50శాతం వాటాలు ఉన్నాయి.